ఎమ్మెల్యే అండతో ఇబ్బంది పెడుతున్నారు
సాక్షి, గుంటూరు: పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర అండతో కొందరు అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ చింతలపూడికి చెందిన ఉషారాణి జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడు బి.గణేష్ను గత నెలలో ఒక వ్యక్తి వాహనంపై వచ్చి ఢీకొట్టడంతో కాలు విరిగితే ఆపరేషన్ చేయించామని.. అయితే తిరిగి తమపైనే ఎమ్మెల్యే ప్రోత్సాహంతో సదరు వ్యక్తి కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారని వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. వైద్యానికి సాయం అందించాలని జగన్ని కోరటంతో వెంటనే పక్కన ఉన్న గుంటూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు రావి వెంకట రమణను చూసుకోవాల్సిందిగా సూచించారు.
రాజధాని రైతుల్లో అయోమయం
రాజధాని నిర్మాణం పేరిట పెద్ద ఎత్తున భూములు ఇచ్చిన రైతుల్లో ప్రభుత్వం అమలు చేస్తున్న విధానాల కారణంగా అయోమయం నెలకొందని తుళ్లూరుకు చెందిన రైతు బత్తుల కిషోర్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పొన్నూరు మండలం ములుకుదురు గ్రామంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలసి రాజధాని రైతుల కష్టాలను వివరించారు. మూడేళ్ల కిందట రాజధాని పేరిట భూములను తీసుకుని అంతర్జాతీయ స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. రైతులను నిండా ముంచారన్నారు. ప్రస్తుతం ఎకరానికి 25 సెంట్లు చొప్పున అభివృద్ధి చేయని భూమిని అప్పగిస్తున్నార న్నారు. రైతు కూలీలకు తొమ్మిదివేల రూపాయలు ఇస్తామని ప్రభుత్వం చట్టం చేసినా.. అమలు జరగడం లేదని జననేత దృష్టికి తీసుకొచ్చారు.