సంకల్ప బలంతో ..
సాక్షి, గుంటూరు: ఏడు పదుల వయస్సు.. ఆయన సంకల్ప బలం ముందు చిన్నబోయింది. అందరి బంధువు జననేత పాదయాత్రలో అలుపెరుగక పయనం సాగిస్తున్నారు. అనుకున్నదే తడవుగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం బోగాలకట్ట గ్రామానికి చెందిన వెన్నపూస నారాయణరెడ్డి ఇడుపులపాయ నుంచి జగన్ వెంటే నడుస్తున్నారు. పొన్నూరు నియోజకవర్గంలోని ములుకుదురు గ్రామం వద్ద 1500 కిలోమీటర్ల మైలురాయిని దాటారు. జగన్తో కలసి ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు పాదయాత్ర చేస్తానని చెబుతున్నారు.
రైతులను ఆదుకోండి
‘ఎరువుల రేట్లు పెరిగి ఆకాశాన్ని అంటుతున్నాయి. రైతు పండించిన పంటకు మాత్రం గిట్టుబాటు ధర రావడం లేదన్నా’ అంటూ కృష్ణాజిల్లా పెనమలూరుకు చెందిన కాకర్ల వెంకటరత్నం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. పొన్నూరు మండలం ములుకుదురులో పర్యటిస్తున్న జననేతను కలసి సమస్యలు విన్నవించారు. గత ఏడాది పసుపులో 30 క్వింటాళ్ల దిగుబడి వస్తే.. ప్రభుత్వం రూ.6500 ధర నిర్ణయించింది. అయినా నష్టాలే వచ్చాయన్నారు. ఈ ఏడాది పసుపు దిగుబడి తగ్గిందని.. ధర కూడా ఐదువేలకు పడిపోయిందని వాపోయారు. మినుములు, కందులు, పెసలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని చెప్పారు. డీఏపీ ఎరువు ధర కట్టకు వంద రూపాయలు పెరిగిందని, కూలి రేట్లు కూడా పెరిగాయని, కృష్ణానదిలో ఇసుకను ఇష్టారాజ్యంగా తరలించడం వలన భూగర్భజలాలు తగ్గి బోర్లలో నీరు కూడా రావడం లేదన్నారు. ఎనిమిది నెలలుగా వర్షాలు లేక పంటలు ఎండిపోయే పరిస్థితి వచ్చిందని కన్నీటిపర్యంతమయ్యారు.