అన్న మీద అభిమానమే నడిపించింది
నడవడానికి కాళ్లు లేకపోయినా జగనన్న మీద అభిమానమే ఆయన దగ్గరకు చేర్చిందని ప్రజాసంకల్ప యాత్రలో జగన్ను కలిసిన దివ్యాంగుడు రేగుల శ్రీను సంతోషం వ్యక్తం చేశాడు. గుదేవారిపాలేనికి చెందిన శ్రీను నిరుద్యోగి. బతుకుదెరువు కోసం గుంటూరులోని కాటన్ మిల్లులో అటెండర్గా పని చేస్తున్న శ్రీను పాదయాత్రలో జగన్ను కలవాలన్న ఆకాంక్షతో సొంతూరుకు ఒక రోజు ముందే వచ్చినట్లు తెలిపాడు. చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు, వికలాంగులకు చేస్తున్న అన్యాయంపై పోరాడాలని జగన్ను కోరినట్లు చెప్పాడు.
మేదరలకు ఆదరణ లేదయ్యా..
రాష్ట్రంలో బుట్టలు, చాటలు, వెదురు గంపలు అల్లుకొని జీవనం సాగిస్తున్న మేదరలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, తమ అభివృద్ధికి సహకరించడం లేదని పామూరు మండలానికి చెందిన ఆదినారాయణ వైఎస్ జగన్ను కలిసి వివరించాడు. ప్రత్యేక కార్పొరేషన్ను ఏర్పాటు చేయడంతోపాటు రుణాలిచ్చి మేదరలను ఆదుకోవాలని కోరాడు.