పొదుపు రుణం మాఫీ కాలేదయ్యా!
నెల్లూరు(సెంట్రల్) :‘అయ్యా నేను రూ.50 వేలు పొదుపులో రుణం తీసుకున్నాను.. ఇప్పటి వరకు ఒక్కరూపాయి కూడా మాఫీ కాలేదు’ అని వెలటూరుపాళేనికి చెందిన ఎం.అనంతమ్మ గురువారం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎదుట వాపోయారు. కొంతమందికి మాత్రమే నగదు బ్యాంకులో పడిందని, తనకు మాత్రం ఎందుకు పడలేదో అధికారులు చెప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ లాంటి వారికి న్యాయం చేస్తామని జననేత వైఎస్ జగన్ ఆమెకు ధైర్యం చెప్పారు.
దివ్యాంగులను మోసం చేస్తున్న ప్రభుత్వం
ఉదయగిరి: ‘అయ్యా.. చంద్రబాబు దివ్యాంగులకు నెలకు రూ.1,500 పింఛన్ ఇస్తామని ఎన్నికల వేళ చెప్పారు. ఇప్పుడు కేవలం రూ.1,000 ఇస్తున్నారు. ఈ విషయమై పలుమార్లు అధికారులను అడిగినా ఫలితం లేదు’ అని కొండాపురం గొట్టిగుండాలపాళేనికి చెందిన ద్యివాంగుడు ఎం.మహేష్ బాబు తల్లి సునీత పాదయాత్రలో గురువారం ఆదిమూర్తిపురం వచ్చిన వైఎస్ జగన్ను కలిసి వాపోయింది. బిడ్డకు పుట్టుకతోనే నరాలు బలహీనత వచ్చిందని, ఆపరేషన్ చేయించినా ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. జననేత జగన్ మోహన్రెడ్డి స్పందిస్తూ త్వరలో మన ప్రభుత్వం వస్తుంది.. అప్పుడు నెలకు రూ.2 వేలు ఇస్తానని ధైర్యం చెప్పారు.