టెట్ను ఒకే రోజు నిర్వహించాలి
నెల్లూరు(సెంట్రల్): ‘సార్.. గతంలో టెట్ను ఓ రోజు నిర్వహించేవారు. దీని వల్ల అందరికీ ఒకే పేపర్ వచ్చేది. అలాగే, సంబంధిత జిల్లా కేంద్రంలో పరీక్ష నిర్వహిస్తుండడంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. ప్రస్తుతం 12 రోజులు పరీక్ష నిర్వహిస్తున్నారు. దీనికితోడు పరీక్షా కేంద్రాలను సుదూర ప్రాంతాల్లో కేటాయించారు. దీంతో అభ్యర్థులకు కష్టాలు తప్పడం లేదు’ అంటూ కొండాపురానికి చెందిన పి. పద్మజ జననేత ఎదుట ఆవేదన వ్యక్తం చేసింది. ఒక రోజు ఇచ్చిన పరీక్షా పేపరును మరో రోజు ఇవ్వకపోవడంతో మార్కుల తేడా ఎక్కువ ఉండి, బాగా చదువుకున్న విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉందంది. ఒకటే రోజు పరీక్ష నిర్వహించేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేసింది.
విజయమ్మ అని నామకరణం
ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పల్లెపల్లెకూ వెళుతున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అక్కచెల్లెమ్మలు అపూర్వ స్వాగతం పలుకుతున్నారు. కొందరు తమ పిల్లలకు రాజశేఖర రెడ్డి, విజయమ్మ అని జననేతతో నామకరణం చేయిస్తూ మురిసిపోతున్నారు. ఇలాగే, కొండాపురం మండలం సిరిగిరపాళెంనకు చెందిన విజయలక్ష్మి, నారాయణ దంపతులు ఆదిమూర్తిపాళెంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కలిసి తమ పాపకు పేరు పెట్టాలని కోరారు. విజయమ్మ అని చిన్నారికి నామకరణం చేసి వైఎస్ జననేత వారినిఆనందింపజేశారు.