ఆదుకునే వారు లేరు..
విజయనగరం : ఆరు మాసాలుగా పక్షవాతంతో మంచం పట్టాను. ఆర్థిక స్థోమత లేక సరైన వైద్యసేవలు అందడం లేదు. ఎవ్వరూ పట్టించుకున్న దాఖలాలు లేవు. జగన్మోహన్రెడ్డికి నా సమస్య చెప్పుకోగా సానుకూలంగా స్పందించారు. ఆయన ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉంది.– కొండల అప్పలరాము, కెంగువ, గజపతినగరం మండలం
వర్షంపైనే ఆధారం..
నాపేరు పి.పాపినాయుడు. మాది గుర్ల మండలం గరికివలస గ్రామం. గ్రామంలోని రైతులంతా వర్షంపైనే ఆధారపడి సాగు చేపడుతున్నారు. సకాలంలో వర్షాలు పడక పంటలు పండడం లేదు. గడిగెడ్డ రిజర్వాయర్కు తోటపల్లి నీటిని మళ్లించ గలిగితే మా ప్రాంత భూములన్నీ సస్యశ్యామలంగా మారుతాయి. అలాగే పల్లిగండ్రేడు నుంచి కెంగువ వరకు ఉన్న గడిగెడ్డ రిజర్వాయర్ కాలువలను సీసీ కాలువలుగా మార్చాలి. ఈ విషయాలను జగన్మోహన్రెడ్డికి వివరించగా, ఆయన సానుకూలంగా స్పందించారు. – పి.పాపినాయుడు, రైతు, గరికివలస
మత్స్యకారులను ఆదుకోవాలి
మత్స్యకారులను ఆదుకొనేందుకు గాను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. సొంతంగా చెరువులు లేక గ్రామాల్లో ఉపాధి దొరకడం లేదు. దీంతో వలసలు పోవాల్సిన దుస్థితి నెలకొంది. జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక మాలాంటి వారిని ఆదుకోవాలి.– మండాది తాతారావు, మత్స్యకారుడు, ముచ్చర్ల, గజపతినగరం మండలం
80 శాతం వికలాంగత్వం ఉన్నా రూ. వెయ్యే..
నాకు 80 శాతం వికలాంగత్వం ఉంది. అయినా ప్రభుత్వం వెయ్యి రూపాయల పింఛన్ ఇస్తోంది. నా రెండు కాళ్లు చచ్చుబడిపోయాయి. ఏ పనీ చేసుకోలేను. వెయ్యి రూపాయల కన్నా ఎక్కువ పింఛనే రావాల్సి ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. జగన్బాబు ముఖ్యమంత్రి అయితే పింఛన్ రెట్టింపు చేస్తామన్నారు. ఆయన ప్రభుత్వం కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నా.
– సారంపాటి సూర్యనారాయణ, ముచ్చర్ల, గజపతినగరం మండలం
హర్షణీయం..
ముస్లిం, మైనార్టీలను సబ్ప్లాన్ పరిధిలోకి తీసుకువస్తానని వైఎస్సార్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి ప్రకటించడం హర్షణీయం. గత ప్రభుత్వాలు ముస్లిం, మైనార్టీలకు మేలు చేసిన దాఖలాలు లేవు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ నాలుగు శాతం రిజర్వేషన్లు ప్రకటించి ముస్లిం,మైనార్టీలను ఆదుకున్నారు. తాజాగా జగన్మోహన్రెడ్డి తమను సబ్ప్లాన్ పరిధిలోకి తీసుకురావడంతో పాటు ఇస్లామిక్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించడం శుభపరిణామం.ఆయనకే మా పూర్తి మద్దతు. – షేక్ మహ్మద్ షఫీ