ఎమ్మెల్యే నుంచి కాపాడండి
విజయనగరం : గుంటూరు జిల్లా వీర్లపాలెంకు చెందిన రామచంద్రారెడ్డి అక్క, బావ ఈ ఏడాది ఆగస్టు 29న పెళ్లికి కంకిపాడు గ్రామానికి కారులో వెళ్తుండగా.. గన్నవరం సమీపంలోని నున్న గ్రామం వద్ద కందుకూరు ఎమ్మెల్యే పోతుల రామారావు కారు 120 కిలోమీటర్ల వేగంతో వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రామచంద్రారెడ్డి అక్క సీతామహాలక్ష్మి అక్కడికక్కడే కన్నుమూయగా.. బావ బొట్టా హరికృష్ణారెడ్డి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎమ్మెల్యే పోతుల రామారావు, డ్రైవర్ కలసి ఆటోలో పరారయ్యారు.
ప్రమాదంపై రామచంద్రారెడ్డి మేనల్లుడు అశోక్రెడ్డి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. డ్రైవర్ కూడా తానే వాహనాన్ని నడిపినట్టు పోలీసుల వద్ద ఒప్పుకున్నాడు. ప్రస్తుతం ఎమ్మెల్యే పోతుల రామారావు మనుషులు రోజూ అశోక్రెడ్డి ఇంటికి వెళ్లి బెదిరిస్తున్నారు. పోలీసులు కూడా ఎమ్మెల్యేకే వత్తాసు పలుకుతున్నారు. కేసును వాపసు తీసుకోనందుకు వేధిస్తున్నారు. మాకు న్యాయం చేయండన్నా.. అని రామచంద్రారెడ్డి పాదయాత్రలో జగన్ను కలిసి వేడుకున్నాడు.