మేం ఎన్నికలను బహిష్కరిస్తున్నాం!
రాజకీయ నాయకులు మా ఊరికి రావొద్దు
గుర్రప్పనాయుడుకండ్రిగ వాసుల వినూత్న నిరసన
చిత్తూరు, తొట్టంబేడు: ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా ఇప్పటివరకు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి జరుగలేదని, ఈ సారి ఎన్నికల్లో పాల్గొనదలచుకోలేదని మండలంలోని గురప్పనాయుడుకండ్రిగ గ్రామస్తులు సోమవారం గోడలకు పోస్టర్లు అంటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ ఏ రాజకీయ నాయకులు, కార్యకర్తలు ఎన్నికల ప్రచారం కోసం తమ గ్రామానికి రావద్దన్నారు. గ్రామంలో ప్రధాన రోడ్డు సౌకర్యం లేదన్నారు. వంతెన నిర్మించాలన్నారు. పంచాయతీలో తాగునీటి సమస్య ఉందన్నారు.
లైట్లు సక్రమంగా వెలగవన్నారు. గతంలో ఎన్నోసార్లు జన్మభూమి–మాఊరులో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. ఇచ్చిన అర్జీలు చెత్తకుండీలో వేశారన్నారు. తమ గ్రామానికి అభివృద్ధి చేయకుంటే తామెందుకు ఓట్లు వేయాలని ప్రశ్నించారు. విషయం తెలుసుకున్న ఎస్ఐ సుధాకర్ గ్రామానికి వెళ్లి గ్రామస్తులతో మాట్లాడారు. మంగళవారం ఎన్నికల అధికారులతో సమావేశం ఏర్పాటు చేస్తామని ఎస్ఐ హామీ ఇచ్చారు. గోడలపై ఇలాంటి పోస్టర్లు అంటించకూడదన్నారు. గ్రామాలను అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న ఎమ్మెల్యే బొజ్జçల గోçపాలకృష్ణారెడ్డి కుటుంబం గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు. 5 సార్లు ఎమ్మెల్యే, మూడుసార్లు మంత్రిగా పనిచేశారన్నారు. ప్రత్యేకించి రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కూడా పనిచేశారన్నారు. గ్రామాల్లో రోడ్లు అధ్వాన్నంగా ఉన్నాయని ప్రజలు అంటున్నారు.