తాండవ జలాలు పొడిగించాలి
విశాఖపట్నం :తాండవ జలాలు గొలుగొండ మండలం వైడి పేట వరకు సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఈ గ్రామానికి చెందిన రైతులు వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. గురువారం ములగపూడి వద్ద రైతునాయకులు ఎస్.వెంకునాయుడు, అప్పారావు తదితరులు జననేతను కలిశారు. వైడి పేటలో రెండు వేల ఎకరాలు సాగుభూములున్నాయని, సమీపంలోని డి.ఎర్రవరం వరకూ తాండవా కాలువ ఉందన్నారు. అయితే తాండవా జలాలు మాప్రాంత భూములకు అందడం లేదని జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. డి.ఎర్రవరం నుంచి వైడి పేట వరకు తాండవ కాలువను పొడిగించి ఈ రెండు వేల ఎకరాలకు సాగునీరు అందించాలని.. లేని పక్షంలో లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అయినా నీరు సరఫరా చేయాలని కోరారు. వైఎస్సార్ సీపీ అ«ధికారంలోకి రాగానే ఈ సమస్యను పరిష్కరించాలని కోరగా..జగన్మోహన్రెడ్డి సానుకూలంగా స్పందించారు.
ఇల్లు ఇప్పించడయ్యా
నాకు ఇల్లు లేదయ్యా. కాలనీ ఇల్లు ఇవ్వాలని చాలా కాలంగా అడిగినా ఇవ్వడం లేదు. నా బాధను జగన్ బాబును కలసి చెప్పుకున్నాను. అధికారంలోకి వస్తే మంజూరు చేస్తామన్నారు. ఆయన తప్పుకుండా ముఖ్యమంత్రి అవుతారు. మా కష్టాలు తీరుస్తారు.– ఇటంశెట్టి వరహాలమ్మ,ములగపూడి, నాతవరం మండలం