ముప్పిడికి పరాభవం

People Against Tdp Mla Muppidi - Sakshi

ద్వారకాతిరుమల: నువ్వు మాకొద్దు.. మా గ్రామానికి రావద్దు.. ఓటమిని అందుకో అంటూ గోపాలపురం టీడీపీ ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావును సొంత పార్టీ నేతలు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ముందుకెళ్లనివ్వకుండా చుట్టుముట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తిమ్మాపురంకు వచ్చిన ఎమ్మెల్యేకు సోమవారం రాత్రి ఈ చేదు అనుభవం ఎదురైంది.  ద్వారకాతిరుమల మండలంలో సోమవారం ఎమ్మెల్యే ముప్పిడి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ప్రచారంలో భాగంగా రాత్రి తిమ్మాపురంకు వచ్చారు. తొలుత పార్టీకి చెందిన వాసిరెడ్డి ప్రవీణ్‌ ఇంటి వద్ద ఆగారు. ఈలోగా ప్రచారాన్ని టీడీపీ కార్యాలయం వద్ద నుంచి ప్రారంభిద్దామని ఎంపీపీ వడ్లపూడి ఈశ్వర భానువర ప్రసాద్‌ ఎమ్మెల్యేను కోరారు. అయితే ప్రవీణ్‌ వర్గం ఇందుకు ఒప్పుకోలేదు. అక్కడి నుంచే ప్రచారం ప్రారంభించాలని కోరింది. దీంతో ఎంపీపీ ప్రచార రథాన్ని దిగి వెళ్లిపోయారు. 
ఈ విషయం తెలుసుకున్న ఎంపీపీ వర్గ నేతలు భగ్గుమన్నారు. వర్గ విభేదాలను ప్రోత్సహిస్తున్న ఎమ్మెల్యే మాకొద్దంటూ పార్టీ గ్రామ అధ్యక్షుడు గంటా శ్రీనివాసరావు, నీటి సంఘం అధ్యక్షుడు పోలిన శ్రీనివాసరావు, ఎంపీటీసీ కూచింపూడి శ్రీనివాసరావు, ఘంటా సత్యనారాయణ తదితరులు రోడ్డుపై ఆందోళనకు దిగారు. ఎమ్మెల్యే మా గ్రామానికి రావద్దంటూ రోడ్డుకు అడ్డంగా ఆటోలను నిలిపారు. నువ్వు మాకొద్దు.. వెళ్లిపో అంటూ ఎమ్మెల్యేను చుట్టుముట్టి వాగ్వాదానికి దిగారు. ఎలా గెలుస్తావో చూస్తామంటూ హెచ్చరించారు. ఇది చూసిన గ్రామస్తులు నివ్వెరబోయారు. విషయం తెలుసుకున్న పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మల్లిపెద్ది వెంకటేశ్వరరావు, ఘంటా బాబ్జి తదితరులు ఘటనాస్థలానికి చేరుకుని పార్టీ నేత ఘంటా సత్యనారాయణ ఇంటి వద్ద పంచాయితీ పెట్టారు. రెండు వర్గాలను వారు బుజ్జగించారు. అయితే ఎమ్మెల్యే గ్రామం నుంచి వెళ్లిపోయారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top