పింఛన్ టెన్షన్..
జిల్లాలో ప్రారంభం కాని పింఛన్ పంపిణీ
ఎండలోనే కేంద్రాల వద్ద వృద్ధుల పడిగాపులు
అనంతపురం టౌన్:జిల్లా వ్యాప్తంగా ఎన్టీఆర్ భరోసా పథకం కింద ఏప్రిల్ నాటికి 42,40,78 మంది లబ్ధిదారులున్నారు. వీరికోసం ప్రభుత్వం రూ.47.61 కోట్ల నిధులను మంజూరు చేసింది. ప్రతి నెల 1 నుంచి 5వ తేదీ లోపు పింఛన్ల పంపిణీ పూర్తి చేయాలని ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న అర్బన్ ప్రాంతాలతోపాటు 1,003 పంచాయతీల్లో 1 నుంచి పింఛన్ పంపిణీ చేపట్టాలి. అయితే ఇప్పటి వరకు చాలా పంచాయతీల్లో పింఛన్ల పంపిణీ ప్రారంభించలేదు.
పింఛన్ కోసం ప్రదక్షణలు: పింఛన్ల కోసం లబ్ధిదారులు పంచాయతీ కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. వేసవి ఎండలను దృష్టిలో ఉంచుకొని ఈనెల నుంచి ఉదయం, సాయంత్రం వేళల్లో పింఛన్లు పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉదయం 7గంటలకే పింఛన్ పంపిణీ కేంద్రాల వద్ద లబ్ధిదారులు పడిగాపులు కాస్తున్నారు. పింఛన్లు పంపిణీ చేసే సిబ్బంది రాకపోవడంతో నిరాశతో వెనుదిరిగి వెళ్తున్నారు. ఇప్పటికే రెండు రోజులుగా ఇదే తంతు కొనసాగుతోంది.
లేపాక్షిలో అధ్వానం
జిల్లా వ్యాప్తంగా పింఛన్ పంపిణీ ప్రక్రియను పరిశీలిస్తే 2వ తేదీ నాటికి లేపాక్షి మండలంలో 8.41 శాతం మాత్రమే పంపిణీ చేశారు. ఇక గుడిబండలో 11.73, ధర్మవరంలో 12.78, హిందూపురంలో 22.48 శాతం మాత్రమే పంపిణీ చేశారు. జిల్లాలోని 39 మండలాల్లో పింఛన్ పంపిణీ 25 నుంచి 50 శాతం మధ్యలోనే ఉంది.ధర్మవరం మండలంలో 18 పంచాయతీల్లో 4,717 పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉంది. 2వ తేదీ కూడా 14 పంచాయతీల్లో పింఛన్ పంపిణీకి శ్రీకారం చుట్టలేదు.చిలమత్తూరు మండలంలో 11 పంచాయతీలుండగా సోమగుట్ట, వీరాపురం, టేకులోడు పంచాయతీల్లో ఇప్పటి వరకు పింఛన్ పంపిణీ ప్రారంభించలేదు. ఈ మూడు పంచాయతీల్లో 1,059 మంది పింఛన్ లబ్ధిదారులున్నారు.