రక్షణ కవచంగా..

One Month Complete For Lockdown For Coronavirus - Sakshi

జనతా కర్ఫ్యూ నుంచి నేటి వరకు ఇలా..

లాక్‌డౌన్‌లో ప్రజలకు భరోసా కల్పించిన ప్రభుత్వం

అండగా అధికారులు, ప్రజాప్రతినిధులు

మినీ రైతుబజార్లు ఏర్పాటుతో ఊరట

ధరలు పెరగకుండా సర్కార్‌ చర్యలు

నెలరోజుల్లో పూర్తిగా స్తంభించిన వాణిజ్య రంగం

జిల్లాలో వేల కోట్ల రూపాయల వ్యాపారం కుదేలు

నిత్యావసరాలు, అత్యవసరాలకు మాత్రమే అనుమతి

సెజ్‌లలో వందల సంఖ్యలో పరిశ్రమల మూత

కోవిడ్‌ – 19.. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. దీనిని ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా చర్యలు చేపట్టింది. జిల్లా అధికారులను ఎప్పకప్పుడు అప్రమత్తం చేస్తూ వైరస్‌ కట్టడికి చర్యలు తీసుకుంది. జిల్లా యంత్రాంగం మొక్కవోని దీక్షతో ప్రాణాలను సైతం పణంగా పెట్టి యుద్ధం చేస్తోంది. లాక్‌డౌన్‌ను తొలిరోజు నుంచి సమర్థవంతంగా అమలు చేస్తూ కోవిడ్‌ విస్తరించకుండా రక్షణ కవచంగా నిలిచింది. వర్తక, వాణిజ్య రంగాలు స్తంభించాయి. ఆర్థికరంగం కుదేలైంది. వేలాది మంది రోడ్డున పడ్డారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు అండగా నిలిచింది. ప్రజాప్రతినిధులు సైతం మేమున్నామంటూ సహాయ కార్యక్రమాలు విస్తృతంగా చేపడుతున్నారు. నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలతో రైతన్నలు, ప్రజలకు ఊరట కలిగింది. నిత్యావసరాల ధరలు పెరగకుండా సర్కారు చర్యలు చేపట్టింది. అటు రైతులకు ఇటు ప్రజలకు మేలు చేసేలా పెద్దఎత్తున మినీ రైతు బజార్లు ఏర్పాటు చేసింది. అందుబాటులోకి కూరగాయలను తీసుకువచ్చింది. ఇక కరోనా మహమ్మారి విస్తరించకుండా అన్ని చర్యలు తీసుకుంది. ఇప్పటివరకూ జిల్లా వ్యాప్తంగా 67 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు పక్కాగా అమలు చేస్తూ ప్రజలకు రక్షణా నిలిచింది.

నెల్లూరు(సెంట్రల్‌): జిల్లాలో ధాన్యం, రొయ్యలు, చేపలతోపాటు వివిధ రకాల ముడి ఖనిజాలు సుమారు 25 దేశాలకు ఎగుమతులు అవుతుంటాయి. అలాగే నిత్యావసరాల్లో అన్ని రకాల పప్పు దినుసులు, నూనె దిగుమతి అవుతుంది. శ్రీసిటీలో అనేక అంతర్జాతీయ కంపెనీలు, అలాగే మేనకూరు, మాంబట్టు సెజ్‌ల్లో పరిశ్రమలు, ఇంకా జిల్లాలో 15 వరకు ప్రధాన ఆక్వా ప్రాసెసింగ్‌ యూనిట్లు, అలాగే ఆక్వా ఫీడ్‌ యూనిట్లున్నాయి. అలాగే స్థానికంగా కృష్ణపట్నం పోర్టు ఉండడంతో అన్ని రకాల ఎగుమతులు ఇక్కడే నుంచి జరగుతుంటాయి. ఈక్రమంలో కరోనా వైరస్‌ కారణంగా లాక్‌డౌన్‌తో పరిశ్రమలు పూర్తిగా మూతపడడంతో ప్రత్యక్షంగా 40 వేల మంది కార్మికులు పూర్తిగా ఉపాధి కోల్పోయారు. రాష్ట్ర ప్రభుత్వానికి జీఎస్టీ ద్వారా జిల్లా నుంచి నెలకు రూ. 60 కోట్లు ఆదాయం వస్తుంది. గడిచిన నెల రోజులగా వ్యాపారాలు పూర్తిగా స్తంభించిపోవడంతో నష్టం వాటిల్లింది. జిల్లా కేంద్రంలోని స్టోన్‌హోస్‌పేటలోని హోల్‌సేల్‌ వ్యాపారులు నిత్యం రూ.58 లక్షల విలువైన పప్పు దినుసులు ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అలాగే రూ.20 లక్షలు విలువైన వంటనూనెను విక్రయిస్తుంటారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో ఈ లావాదేవీలన్నీ నిలిచిపోయాయి. ప్రస్తుతం నిబంధనలు సడలించడంతో దిగుమతులు ప్రారంభమయ్యాయి.

నిలిచిపోయాయి
ఆక్వా రంగానికి భారీ నష్టం వాటిల్లింది. పూర్తిగా ఎగుమతులు నిలిచిపోవడంతో వందల కోట్లు రూపాయల విలువైన ఎగుమతులు నిలిచిపోయినట్లు అంచనా. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 62వేల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. ఇక్కడి నుంచి చైనా, సింగపూర్, మలేసియా, కెనడా తదితర దేశాలకు రొయ్యల ఎగుమతి చేసేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవడంతో రైతన్నలు ఊపిరి పీల్చుకున్నారు. ఈనెల 12 నుంచి 20 తేదీ వరకూ కృష్ణపట్నం పోర్టు ద్వారా కంటైనర్లలో సుమారు 12 వేల మెట్రిక్‌ టన్నుల రొయ్యల్ని ఎగుమతి చేశారు.

మాల్స్, బంగారు దుకాణాలు లాక్‌డౌన్‌లోనే..
జిల్లావ్యాప్తంగా ఉన్న మాల్స్,సినిమా హల్స్, బంగారు దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. కేవలం నెల్లూరు నగరంలోనే బంగారు ఆభరణాలు తయారు చేసే యూనిట్లులో సుమారు 8 వేల మంది కార్మికులు పనిచేస్తుంటారు. వీరు పూర్తిగా ఉఫాధి కోల్పోయారు. ఇక నగరంలోని సినిమా థియేటర్లు అన్ని మూతపడ్డాయి. వీటికి కూడా భర్తీ చేయలేని భారీ నష్టం వాట్లిలింది.

స్తంభించిన ఎగుమతులు
జిల్లాలో చిన్నా, పెద్ద అన్ని కలిపి సుమారు 800 వరకు నిత్యావసర వస్తువులు తయారీ చేసే పరిశ్రమలున్నట్లు అధికారులు చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో వీటిని మూసివేశారు. దీంతో ఎగుమతులు, దిగుమతులు, వీటితోపాటు తయారీ పూర్తిగా నిలిచిపోయింది. ప్రధానంగా చిన్న, పెద్ద వ్యాపార సంస్థలు పూర్తిగా మూసివేశారు. దీంతో వ్యాపారులు నష్టాల్లోకి వెళ్లారు. కార్మికులకు గడ్డుకాలం వచ్చింది. నిర్మాణ రంగంపై తీవ్ర ప్రభావం పడడంతో దినసర కూలీలు, వలస కార్మికులపై తీవ్ర ప్రభావం పడింది. ఆటోమొబైల్‌ రంగం పూర్తిగా దెబ్బతినిందనే చెప్పాలి. 

67 కేసుల నమోదు
జిల్లాలో ఇప్పటివరకు 67 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. అందులో ఇద్దరు మృతిచెందగా, ఆరుగురు ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అత్యధికంగా ఢిల్లీ మర్కజ్‌ కేసులే. కరోనా మహమ్మారి విస్తరించకుండా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. కేసులు వేగంగా పెరగకుండా కట్టడి చేయగలిగింది. జిల్లాలోని 46 మండలాల్లో 28 మండలాలు రెడ్‌జోన్లుగా ఉన్నాయి. వాటిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. పారిశుధ్య పనులు ముమ్మరంగా చేస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అత్యాధునిక యంత్రాలను తీసుకువచ్చి సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. నెల్లూరులోని పెద్దాస్పత్రితోపాటు, నారాయణ ఆస్పత్రిలో ఐసొలేషన్‌ వార్డులు ఏర్పాటు చేసింది. అలాగే 11 చోట్ల క్వారంటైన్‌ కేంద్రాలను ఉంచారు. 2 వేల ట్రూనాట్‌ కిట్లతో పరీక్షలు వేగవంతం చేసింది. ప్రస్తుతం 8,900 ర్యాపిడ్‌ కిట్లు జిల్లాకు వచ్చాయి. త్వరలో మరింత మందికి వేగంగా పరీక్షలు చేసేందుకు సిద్ధమవుతోంది. అలాగే డాక్టర్లకు అవసరమైన పీపీఈ కిట్లను, మాస్కులను ప్రభుత్వం అందజేసింది.

మేమున్నాం
లాక్‌డౌన్‌ నేపథ్యంలో పది నియోజకవర్గాలకు చెందిన అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, పలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతలు పేదల ప్రజలను ఆదుకుంటున్నారు. అధికారులు, సచివాలయ సిబ్బంది, వలంటీర్లతో కలిసి నిత్యావసరాలు, కూరగాయలు పంపిణీ చేస్తున్నారు. ప్రతి మండలంలో ప్రజాప్రతినిధులు పారిశుధ్య కార్మికులకు మాస్కులు, గ్లౌజులు, సరుకులను అందిస్తూ అండగా నిలుస్తున్నారు.

ప్రభుత్వం చర్యలు తీసుకోవడంతో..
వ్యవసాయ రంగానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఊరటనిచ్చాయి. జిల్లాలో నిమ్మ, ధాన్యం, కూరగాయల విక్రయాలు ఊపందుకున్నాయి. «ప్రధానంగా ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరకే కేంద్రాల ద్వారా కొనుగోలు చేసి మిల్లులకు తరలిస్తున్నారు. ఇక్కడి మిల్లుతోపాటు చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలోని మిల్లులకు తరలిస్తున్నారు. లాక్‌డౌన్‌ మొదలు నుంచి ఇప్పటివరకు 70 వేల మెట్రిక్‌ టన్నల ధాన్యం కొనుగోలు చేశారు. అంతకముందు వరకు 179 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.20 లక్షల మెట్రిక్‌టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది.  అలాగే జిల్లాలో నిమ్మసాగు సుమారు 20 వేల హెక్టార్లలో జరుగుతోంది. కాగా పొదలకూరు, గూడూరుల్లో నిమ్మ మార్కెట్‌ యార్డులున్నాయి. వీటి ద్వారా నిత్యం 200 నుంచి 250 టన్నుల వరకు ఢిల్లీ, ముంబై, చెన్నై తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. లూజు బస్తా ధర రూ.2,200 నుంచి 2,300 వరకు ఉంది. కాగా ఉపాధి పనులు మంగళవారం నుంచి ప్రారంభయ్యాయి. ఇదిలా ఉండగా ప్రభుత్వం రెండు దఫాలుగా రేషన్‌ అందజేసింది. అలాగే రూ.1,000 ఆర్థిక సాయాన్నింది. అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 9,04,220 మంది కార్డుదారు లున్నారు. వారిలో 90 శాతం వరకు లబ్ధిదారులకు ఇప్పటికే రెండో విడత రేషన్‌ను సర్కార్‌ అందజేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top