నా భర్తకు ప్రాణదానం చేయండి
కోరుకొండ, న్యూస్లైన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన తన భర్తకు ప్రాణదానం చేసేందుకు సహకరించి తమ కుటుంబాన్ని నిలబెట్టాలని ఆమె కన్నీటితో అభ్యర్థిస్తోంది. కోరుకొండ మండలం పశ్చిమగానుగూడెం గ్రామానికి చెందిన బూరుగు తిరువెంగళం పదిహేను రోజుల క్రితం రాజమండ్రిలో మోటార్బైక్ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సందర్భంగా అతని తలకు బలమైన గాయాలయ్యాయి. తన భర్తకు వైద్య ఖర్చులకోసం దాతలు సహకరించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని తిరువెంగళం భార్య తులసి కోరుతోంది. ఆమె శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ గ్రామస్తులు, బంధువులు సమకూర్చిన మొత్తం రూ. 1.50 లక్షలతో ఇంతవరకు తన భర్తకు వైద్యం చేయించినట్టు ఆమె తెలియజేసింది. మరో రూ. 5 లక్షలు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారని ఆమె వాపోయింది.
రాజమండ్రిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నట్టు ఆమె తెలియజేసింది. తమది పేద కుటుంబమని, తమకు మల్లీశ్వరి, సాయిలక్ష్మి అని ఇద్దరు చిన్నవయసున్న కుమార్తెలు ఉన్నారని తెలిపింది. దాతలు దయతలచి ఆదుకోవాలని ఆమె అభ్యర్థించింది. సహాయం చేసే వారు వివరాలకు సెల్ నంబర్ 9000148658ను సంప్రదించాల్సిందిగా సూచించింది. విరాళాలు ఇచ్చేవారు ఎస్బీఐ ఎకౌంట్ నంబర్ 32594847178ను జమ చేయాల్సిందిగా కోరింది.