చంద్రబాబూ.. ఖబడ్దార్‌!

Muslim Minorities Leaders Protest Against TDP In Prakasam - Sakshi

ఇచ్చిన హామీలు నెరవేర్చమంటే అరెస్ట్‌ చేస్తారా?

ముస్లిం యువకులను చిత్ర హింసలు పెట్టడం అన్యాయం

నంద్యాల ముస్లిం యువకులపై కేసులు ఎత్తేయాలి

ముస్లింలు ఏకమైతే ప్రభుత్వాలు కూలిపోతాయ్‌

నారా నహీ హమారా.. టీడీపీ నహీ హమారా..

ఒంగోలులో ముస్లిం మైనారిటీ నాయకుల ర్యాలీ

ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞప్తి

ఒంగోలు సబర్బన్‌: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు డౌన్‌..డౌన్‌.. ముస్లింలపై సర్కారు దౌర్జన్యకాండ నశించాలి.. చంద్రబాబు నియతృత్వ పోకడలు మానుకోవాలి.. టీడీపీ సర్కార్‌ ముస్లింల అణచివేత ధోరణిని విడనాడాలి.. అంటూ ఒంగోలు నగరంలో ముస్లింలు నినదించారు. ముస్లింలపై చంద్రబాబు సర్కార్‌ దౌర్జన్యకాండను నిరశిస్తూ వైఎస్సార్‌ సీపీ ముస్లిం మైనారిటీ విభాగం ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం సాయంత్రం ర్యాలీ నిర్వహించారు. స్థానిక చర్చి సెంటర్‌లో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి విగ్రహం నుంచి వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర మైనారిటీ విభాగం జనరల్‌ సెక్రటరీ షేక్‌ సుభానీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. అక్కడ నుంచి పోస్టాఫీస్‌ మీదుగా ఒంగోలు ఒన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో చంద్రబాబు వ్యతిరేకంగా ముస్లింలు నినాదాలు చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పోలీసులకు ఉందని, పోలీసులే అధికార పార్టీ వారికి అనుకూలంగా ఉంటూ రాజ్యాంగం ప్రకారం ముస్లింలకు రావాల్సిన హక్కులు అడిగినందుకు ముస్లింలను అక్రమంగా గుంటూరులో అరెస్టు చేశారని ధ్వజమెత్తారు.

ముస్లింలను అప్రజాస్వామ్యంగా, అక్రమంగా అరెస్టు చేయవద్దని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని కోరుకుంటున్నామని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. అనంతరం ముస్లిం నేతలు మీడియాతో మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలిపిన ఎనిమిది మంది ముస్లిం యువకులను నిర్బంధించడం దారుణమన్నారు. చంద్రబాబు సభను భగ్నం చేయాలని చూశారని నంద్యాలకు చెందిన ముస్లిం యువకులను అరెస్టు చేయడాన్ని తప్పుబట్టారు. నారా హమారా– టీడీపీ హమారా అనేది అబద్ధమని, నారా నహీ హమారా.. టీడీపీ నహీ హమారా అనేది వాస్తవమన్నారు. నిజాన్ని ముస్లిం సమాజం గమనించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు బూటకపు హామీలపై జాగ్రత్తగా ఉండాలని ముస్లింలకు సూచించారు. ముస్లింలకు రక్షణ కల్పిస్తామని గుంటూరు సభలో చెప్పిన చంద్రబాబు అక్కడే ఎనిమిది మంది ముస్లిం యువకులను ఎందుకు అరెస్టు చేయించారని ప్రశ్నించారు. నిరసన వ్యక్తం చేసిన ముస్లిం యువకులను అరెస్టు చేసి ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఖూనీ చేసిందని ధ్వజమెత్తారు. ఇలాంటి కర్కశ నియంతృత్వ పాలన సాగిస్తున్న చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో ముస్లింలు తగిన బుద్ధి చెబుతారని, ఖబడ్దార్‌.. అంటూ హెచ్చరించారు. వైఎస్సార్‌ సీపీని అధికారంలోకి తీసుకొచ్చి ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని స్పష్టం చేశారు. నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌ కళా పరిషత్‌ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ షేక్‌ దస్తగిరి బాషా, పార్టీ 29వ డివిజన్‌ కన్వీనర్‌ సయ్యద్‌ హిమాంసా, షేక్‌ అబ్దుల్‌ ఖుద్దూస్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top