టీడీపీ పాలనకు త్వరలో ముగింపు
డోన్ టౌన్: కన్నబిడ్డలు, కట్టుకున్న భార్యతో పాటు కుటుంబ సభ్యులను వదిలి ఆరు నెలల పాటు ప్రజాసమస్యలు తెలుసుకునేందుకే సుదీర్ఘ పాదయాత్ర చేపట్టిన జననేత జగన్మోహన్రెడ్డికి జనం బ్రహ్మరథం పడుతున్నారని, ఇది చూసి టీడీపీ నాయకులు బెంబెలెత్తిపోతున్నారని పీఏసీ చైర్మన్, ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి అన్నారు. రాష్ట్రంలో టీడీపీ పాలనపై జనం విసుగెత్తిపో యారని త్వరలోనే ముగింపు పలుకుతారన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్రలో భాగంగా బేతంచెర్ల పాతబస్టాండ్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బుగ్గన మాట్లాడారు.
నియోజకవర్గంలో టీడీపీ నేతల దౌర్జన్యాలు, అవినీతి పరాకాష్టకు చేరిందని, సమస్యలు విస్మరించి అవినీతిపైనే శ్రద్ధ పెట్టిన అధికార పార్టీ నాయకులకు వచ్చే ఎన్నికల్లో జనం బుద్ధి చెబుతారని హెచ్చరించారు. నియోజకవర్గానికి మైనింగ్ కళాశాల, చెరువులను హంద్రీనీవా నీటితో నింపే కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తుందన్నారు. ఖాయిలా పడిన పాలిసింగ్, నాపరాయి, గ్రానైట్ పరిశ్రమలతో పాటు సున్నపుబట్టీలను తిరిగి ప్రారంభించేందుకు జగన్మోహన్ రెడ్డి ప్రోత్సాహం అందిస్తారని తెలిపారు. రాజన్న రాజ్యం తిరిగి తెచ్చుకునేందుకు వైఎస్ జగన్ మోహన్రెడ్డిని ఆశీర్వదించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.