చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలు
మంత్రి పేర్ని నాని
సాక్షి, తాడేపల్లి: రాజకీయాలు కోసం ఎంతకైనా బరితెగించే వ్యక్తి చంద్రబాబు అని మంత్రి పేర్ని నాని మండిపడ్డారు. సోమవారం ఆయన వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నికల సంఘం ఉన్నతాధికారులపై.. ఏం మాట్లాడారో చంద్రబాబు గుర్తుచేసుకోవాలని ధ్వజమెత్తారు. కేంద్ర ఎన్నికల సంఘం అధికారిని కూడా అంతు చూస్తానని బెదిరించారన్నారు. చంద్రబాబువి దిగజారుడు రాజకీయాలని.. అధికారంలో ఉన్నప్పుడు కళ్లు తలకెక్కి మాట్లాడిన చంద్రబాబు.. ఇప్పుడు సూక్తులు చెబుతున్నారని ఆయన నిప్పులు చెరిగారు. (‘అలా అయితే ముఖ్యమంత్రి ఎందుకు?’)
చంద్రబాబు ప్రలోభాలకు లొంగినట్లుగా ఎన్నికల కమిషనర్ తీరు ఉందని విమర్శించారు. ఎన్నికలు వాయిదా వేస్తారని టీవీ5, ఆంధ్రజ్యోతి ముందే చెప్పామంటున్నాయి.. ఎవరికీ అంచనా లేని అంశం ఆ మీడియాకు ఎలా తెలిసిందని ప్రశ్నించారు. రాజ్యాంగానికి లోబడే ఎన్నికల కమిషనర్ ప్రవర్తించాలన్నారు. విచక్షణాధికారాన్ని ధర్మబద్ధంగా వాడనప్పుడు విలువ ఇవ్వరన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో సమీక్షించకుండానే నిర్ణయం ఎలా తీసుకుంటారని నాని మండిపడ్డారు.
మీడియాను నిర్వీర్యం చేసిన ఘనత కూడా చంద్రబాబుదేనన్నారు. ఎన్టీఆర్కు పొడిచిన వెన్నుపోటును కప్పిపుచ్చుకునేందుకు ఓ పత్రికను నిర్వీర్యం చేసి.. ఆర్థికభారంతో మూతపడ్డ మరో పత్రికను తన డబ్బులతో వెలుగులోకి తెచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా ఎన్నికల కమిషనర్ సజావుగా ఎన్నికలు నిర్వహించాలన్నారు. వైఎస్ జగన్ పాలనపై చంద్రబాబుతో బహిరంగ చర్చకు సిద్ధమని పేర్ని నాని సవాల్ విసిరారు.