వరద తగ్గుముఖం పడుతోంది: మంత్రి మోపిదేవి
సాక్షి, విజయవాడ : రాష్ట్రంలో వర్షాలు కుదుటపడటంతో వరద తగ్గుముఖం పడుతోందని పశుసంవర్ధకశాఖ మంత్రి మోపీదేవి వెంకటరమణ పేర్కొన్నారు. భారీగా కురిసిన వర్షాలతో వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లో మంత్రి మూడు రోజులుగా పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సందర్భంగా ముంపు ప్రాంతాల్లోని సమస్యలపై ఆయన దృష్టి సారించారు. వరద ప్రాంతాల్లోని తాగునీరు, విద్యుత్ పునరుద్ధరిస్తామని తెలిపారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ప్రజల అవసరాలను తీరుస్తూ, సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. గతంలో ఎన్నడులేని విధంగా సహాయ చర్యలు చేపట్టామని, టీడీపీ నేతలు అనవసరంగా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.
పర్యటనకు వెళ్లిన సమయంలో వరద ముంపుకు గురైన వారిని తాము మినరల్ వాటర్ అడిగినట్లు ఒక ఛానల్లో ప్రసారం అయ్యిందని, దానిలో మాట్లాడిన వ్యక్తి ఎవరిని విచారిస్తే అతను తెలుగుదేశం కార్యకర్త అని తెలిసిందన్నారు. అయితే వరద ముంపుకు గురై ఇబ్బంది పడుతున్న వారిని మినరల్ వాటర్ అడిగే దిక్కు మాలిన ఆలోచనలు తమకు లేవని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు వరదల్లో బురద రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఆ చానల్ ప్రసారం చేసిన వార్తల్లో వాస్తవం లేదని కొట్టి పారేశారు.