ఏపీలో 850 ఎంబీబీఎస్ సీట్ల కోత!
సాక్షి, అమరావతి : నీట్ ఫలితాలు వెలువడిన వేళ అభ్యర్థుల నెత్తిన పిడుగు పడింది. ఆంధ్రప్రదేశ్లో 850 ఎంబీబీఎస్ సీట్లకు అనుమతి నిరాకరిస్తూ సోమవారం కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ఉత్తర్వులు వెలువరించింది. దీంతో మెరుగైన ర్యాంకులు తెచ్చుకున్న విద్యార్థుల్లో సైతం భయాందోళనలు మొదలయ్యాయి. విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాల (150 సీట్లు)తో పాటు మరో ఆరు ప్రైవేటు కళాశాలల్లో ఈ సీట్ల కోత పడింది. ఇందులో విశాఖపట్నం గీతం మెడికల్ కళాశాలలో (డీమ్డ్ కావడంతో) కన్వీనర్ సీట్లు ఉండవు. మిగిలిన ప్రైవేటు కళాశాలల్లో 50 శాతం సీట్లు కన్వీనర్ కోటా సీట్లలోకి వస్తాయి. ఈ లెక్కన 350 కన్వీనర్ కోటా సీట్లు పూర్తిగా కోల్పోయినట్లు అయింది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సీట్లు రాకపోయినా ప్రైవేటు కళాశాలల్లో ఉన్న కన్వీనర్ కోటా సీట్లలో అయినా చేరచ్చుననే ఆశతో ఉన్న వారికి ఒక్కసారిగా పిడుగు పడినట్టయింది.