భారీగా పెరిగిన పోలీసుల బీమా
డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు ఇన్సూరెన్స్ 45 లక్షలు
బీమా కంపెనీకి ప్రీమియం కింద రూ. 4.74 కోట్లు చెల్లింపు
కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకూ బీమా రూ. 13 లక్షల నుంచి రూ. 20 లక్షలకు పెంపు
ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ వరకూ 35 లక్షలు ఇన్సూరెన్స్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుశాఖల సంయుక్తంగా పోలీసు సంక్షేమ నిధి నుంచి నిర్వహిస్తున్న గ్రూపు ఇన్సూరెన్స్ విలువను భారీగా పెంచారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఈ బీమాను పెంచడం విశేషం. గతంలో కానిస్టేబుల్ నుంచి ఏఎస్ఐ వరకూ సుమారు రూ.13 లక్షలు ఇన్సూరెన్స్గా ఉండగా.. ఇప్పుడు దాన్ని రూ. 20 లక్షలకు పెంచారు. అలాగే ఎస్ఐ నుంచి ఇన్స్పెక్టర్ వరకూ రూ. 35 లక్షలను చెల్లించనున్నారు. డీఎస్పీ ఆపై స్థాయి అధికారులకు రూ. 45 లక్షలను గ్రూప్ ఇన్సూరెన్స్ కింద చెల్లించనున్నారు. ఈ గ్రూపు ఇన్సూరెన్స్తో పాటు ప్రమాదవశాత్తూ పోలీసులకు ఏదైనా జరిగితే చెల్లించే బీమాను కూడా గణనీయంగా పెంచారు. ఎవరైనా పోలీసు సిబ్బంది అకాల మరణంచెందితే రూ. 30 లక్షలు, తీవ్రవాదులు లేదా ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోతే రూ. 40 లక్షలను అందిస్తూ ఇటీవలే నిర్ణయం తీసుకుని అమల్లోకి తెచ్చారు.
గ్రూప్ ఇన్సూరెన్స్తో 64,719 మంది పోలీసు సిబ్బంది కుటుంబాలకు బీమా భద్రత లభిస్తుంది. పదవీవిరమణ పొందిన తర్వాత కూడా ఈ పాలసీలు అమలుకానున్నాయి. బుధవారం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ప్రభుత్వం, పోలీసు శాఖల తరఫున యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీకి రూ. 4.74 కోట్లను చెల్లించారు. ఈ కార్యక్రమంలో హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్ సవాంగ్, అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్, యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు.
సీఎం జగన్కు ధన్యవాదాలు
పోలీసుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల పట్ల పోలీసు ఆఫీసర్స్ అసోసియేషన్ సీఎంకు ధన్యవాదాలు తెలియజేసింది. వారాంతపు సెలవుతో 64 వేల మంది పోలీసు కుటుంబాల్లో ప్రభుత్వం ఆనందాన్ని నింపిందని, అలాగే పోలీసుల గ్రూప్ ఇన్సూరెన్స్తో పాటు, యాక్సిడెంట్ పాలసీ విలువ కూడా పెంచి మరింత భరోసా నిచ్చిందని పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలియజేశారు.