టీడీపీ దాష్టీకం


దేవరపల్లి : దేవరపల్లి మండల పరిషత్ అధ్యక్ష ఎన్నిక వాయిదా పడింది. మండలంలో 23 ఎంపీటీసీ స్థానాలకుగాను వైఎస్సార్ కాంగ్రెస్‌కు 12 స్థానాలతో స్పష్టమైన మెజార్టీ ఉంది. ఎన్నిక ప్రక్రియను రసాభాస చేసిన టీడీపీ శ్రేణులు, ఆ పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక వాయిదా వేయించటంలో కృతకృత్యులయ్యారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు తదుపరి ఎన్నిక నిర్వహించే తేదీని ప్రకటిస్తామని ఎన్నికల అధికారి ఎంవీ రామారావు ప్రకటించారు.



ఎన్నిక సందర్భంగా శుక్రవారం టీడీపీ కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయంలోకి చొరబడి వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దాడికి దిగటం, ఫర్నిచర్ ధ్వసం చేయటం వంటి ఘటనలకు పాల్పడ్డారు. మధ్యాహ్నం 12 గంటలకు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులు మండల పరిషత్ కార్యాలయానికి చేరుకొని సమావేశ మందిరంలోని వెళ్లారు. అనంతరం టీడీపీ ఎంపీటీసీ సభ్యులు వచ్చి వారి స్థానాల్లో కూర్చున్నారు. కో-ఆప్షన్ సభ్యుని ఎన్నికకు ఎన్నికల అధికారి సభ్యులతో సంతకాలు తీసుకుంటుండగా టీడీపీ కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయం వద్దకు చేరుకొని బందపురం స్వతంత్ర ఎంపీటీసీ అభ్యర్థి పి.సుబ్బారావు బయటకు రావాలని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ, వైసీపీ కార్యకర్తలు ఒకరిపై ఒకరు రాళ్లు రువ్వుకోంటంతో రెండు వర్గాలకు చెందిన పలువురికి గాయాలయ్యాయి.



ఆ సమయంలో కొందరు టీడీపీ నాయకులు, కార్యకర్తలు మండల పరిషత్ కార్యాలయం తలుపులు పగులగొట్టి సమావేశ మందిరంలోకి ప్రవేశించారు. తమ పార్టీ కార్యకర్తలపై జరిగిన దాడికి సమాధానం చెప్పాలని ఎన్నికల అధికారులను నిలదీశారు. వారు వైఎస్సార్ సీపీ ఎంపీటీసీలపై దౌర్జన్యానికి దిగారు. కూర్చున్న కుర్చీలను లాగేసి విరగ్గొట్టారు. ఈ సంఘటనతో వైసీపీ ఎంపీటీసీలు, అధికారులు భయభ్రాంతులకు గురయ్యారు. దీనిని అక్కడే ఉన్న ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు చూస్తూ కూర్చున్నారు. టీడీపీ కార్యకర్తలను పోలీసులు బలవంతంగా బయటకు పంపించేశారు. రోడ్డుపై ఇరు వర్గాలు బాహాబాహీకి దిగటంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. సుమారు 4 గంటలు ఆ ప్రాంతంలో యుద్ధ వాతావరణం నెలకొంది.

 

ఎంపీ మురళీమోహన్ రాక

సాయంత్రం సుమారు 5 గంటలకు ఎంపీ మాగంటి మురళీమోహన్ మండల పరిషత్ కార్యాలయానికి రావటంతో వైసీపీ కార్యకర్తలు నిరసనకు దిగారు. వారు మెయిన్ గేటు నుంచి లోనికి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఎంపీవెంటనే వెళ్లిపోవాలని కార్యకర్తలు నినాదాలు చేశారు. కొద్ది  సేపటికి ఎంపీ కారులో తిరిగి వెళుతుండగా వైసీపీ కార్యకర్తలు వాహనాన్ని అడ్డుకొని రాళ్ల రువ్వారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాటలు జరిగాయి.  డీఎస్సీ వి.రాజగోపాల్ ఆధ్వర్యంలో పోలీసులు లాఠీ చార్జి చేసి వారిని చెదరగొట్టారు.



పోలీస్ బందోబస్తు తక్కువ ఉండటంతో ఈ పరిస్థితి ఏర్పడిందని పలువురు విమర్శించారు. రెండు రోజుల ముందు నుంచి పోలీసులక మొరపెట్టుకున్నా బందోబస్తు విషయంలో విఫలమయ్యారని అధికారులు వాపోయారు. సాయంత్రం 5 గంటలకు కో-ఆప్షన్, ఎంపీపీ ఎన్నికను వాయిదా వేస్తున్నట్టు ఎన్నికల అధికారి రామారావు ప్రకటించడంతో వైఎస్సార్ సీపీ ఎంపీటీసీ సభ్యులను పోలీసులు తమ వాహనంలో ఎక్కించుకొని తీసుకెళ్లారు.

 

దేవరపల్లిలో 144 సెక్షన్

ఈ ఘర్షణల కారణంగా దేవరపల్లిలో 144 సెక్షన్ విధించినట్టు తహసిల్దార్ అక్బర్ హుస్సేన్ తెలిపారు.

 పోలీసుల రక్షణలో మండల పరిషత్ కార్యాలయంఎంపీపీ ఎన్నికల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణ వాతావరణం కారణంగా మండల పరిషత్ కార్యాలయం వద్ద శుక్రవారం సాయంత్రం పోలీసు భద్రత ఏర్పాటు చే శారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top