ఉద్యోగానికి వెళ్తే ఉసురు పోయింది!
రైలు నుంచి జారిపడి బడ్డిపేట యువకుడి మృతి
హైదరాబాద్లో ఘటన ఆర్మీ రిక్రూట్మెంట్కు వెళ్లి అనంతలోకాలకు..
శ్రీకాకుళం, కోటబొమ్మాళి: మండలంలోని సరియాబొడ్డపాడు పంచాయతీ బడ్డిపేట గ్రామానికి చెందిన అన్నెపు సతీష్(19) ఆర్మీ రిక్రూట్మెంట్ కోసం సికింద్రాబాద్ వెళ్లి మంగళవారం రైలు ప్రమాదంలో చనిపోయాడు. ఆదివారం సికింద్రాబాద్లో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొనేందుకు సతీష్ ఇక్కడి నుంచి బయల్దేరి వెళ్లాడు. అయితే వర్షం కారణంగా ర్యాలీ వాయిదా పడడంతో తన సోదరుడు కిశోర్తో కలిసి మంగళవారం సాయంత్రం స్వగ్రామానికి వచ్చేందుకు హైదరాబాద్లో ఫలక్నుమా రైలు ఎక్కాడు.
రైలు కొద్ది దూరం వెళ్లాక రైలు నుంచి జారి కింద పడిపోయి తీవ్రంగా గాయపడ్డాడు. సమీపంలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. కొడుకు మరణవార్త తెలిసి తల్లి కళావతి, తండ్రి ఆనంద్లు కంటికిమింటికి ఏకధారగా రోదిస్తున్నారు. కుటుంబాన్ని ఆదుకుంటాడు అనుకున్న కొడుకు ఇలా అర్ధంతరంగా తనువు చా లించడంతో శోకం తట్టుకోలేకపోతున్నారు. గ్రా మంలోనూ విషాద ఛాయలు అలముకున్నాయి. యువకుడి మృతదేహాన్ని గురువారం స్వగ్రామానికి తీసుకురానున్నట్లు స్థానికులు తెలిపారు. హైదరాబాద్ రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.