వివాహానికి వెళ్లి తిరిగొస్తూ...
ముడిదాం వద్ద రోడ్డు ప్రమాదం
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
వరుసకు సోదరుడైన వ్యక్తితో పాలిటెక్నిక్ డిప్లమా చేసిన ఓ యువకుడు విశాఖ నుంచి పార్వతీపురంలో బంధువుల వివాహానికి గురువారం రాత్రి బయలుదేరాడు. వివాహమైన తరువాత అర్ధరాత్రి దాటిన తరువాత తిరుగు ప్రయాణమయ్యాడు. విజయనగరం దాటిన తరువాత ముడిదాం వద్ద ప్రమాదానికి గురయ్యారు. చూసేసరికి డ్రైవింగ్ చేసిన యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చొన్న వ్యక్తి తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విజయనగరం టౌన్: పార్వతీపురంలో ఉన్న బంధువుల వివాహానికి విశాఖ నుంచి బైక్పై వెళ్లి, అర్ధరాత్రి దాటిన తర్వాత తిరుగు ప్రయాణంలో ముడిదాం వద్దకు చేరుకునే సరికి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు దుర్మణం చెందాడు. వెనుక కూర్చొన్న వరుసకు సోదరుడైన ఓ వ్యక్తి గాయాల పాలయ్యాడు. దీనికి సంబంధించి రూరల్ ఎస్ఐ రామకృష్ణ అందించిన వివరాలిలా ఉన్నాయి.
♦ విశాఖ జిల్లా మర్రిపాలెం 104 ఏరియాలో నివాసముంటున్న కుప్పిలి బాలమురళీకృష్ణ (23) గురువారం సాయంత్రం పార్వతీపురంలో బంధువుల పెళ్లికి వరుసకు సోదరుడైన జయప్రకాష్తో కలిసి బైక్పై వెళ్లాడు. వివాహం అయిన తరువాత ఆ రాత్రే విశాఖకు తిరుగు ప్రయాణమయ్యాడు. గజపతినగరం, బొండపల్లి దాటిన వరకు మెలకువగా ఉన్న సోదరుడు నిద్రమత్తులోకి జారుకున్నాడు.
♦ రాత్రి రెండు గంటల సమయంలో విజయనగరం దాటిన తరువాత ముడిదాం వద్ద ప్రమాదానికి గురయ్యాడు. మెలకువలోకి వచ్చిన వెనుక కూర్చొన్న వరుసకు సోదరుడైన జయప్రకాష్ కొలుకుని చూసే సరికి రక్తపు మడుగులో బాలమురళీకృష్ణ కనిపించాడు. చూసే సరికి అక్కడికక్కడే మృత్యువాత పడినట్టు తెలిపాడు. పరిసరాల్లో ఎటువంటి వాహనం లేదని పోలీసులకు జయప్రకాష్ చెప్పాడు. ఇదిలా ఉండగా గుర్తు తెలియని వాహనం డీకొందా...లేక నిద్రమత్తులో ప్రమాదానికి గురయ్యాడా...అనే అంశాలతో పోలీసులు విచారణ చేస్తున్నారు. మృతునికి తల్లి, సోదరుడు ఉన్నారు. బాలమురళీకృష్ణ ఇటీవలె పాలిటెక్నిక్ డిప్లమా పూర్తి చేసి ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. గాయాల పాలైన జయప్రకాష్ చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు.