బాబుకు ‘కొనుగోళ్ల’పై ఉన్న శ్రద్ధ పేదలపై లేదు
మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
గోనెగండ్ల: ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడంలో చూపుతున్న శ్రద్ధ పే దల సమస్యలు పరిష్కరించడంలో చూపడం లేదని మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైఎస్సార్సీపీ విజయవాడ నగర అధ్యక్షుడు వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. టీడీపీ తన మూడున్నరేళ్ల పాలనలో ఎలాంటి అభివృద్ధీ చేయలేదన్నారు. ప్రజాసంకల్ప యాత్రలో పాల్గొన్నవారు బుధవారం గోనెగండ్ల సమీపంలో విలేకరులతో మాట్లాడారు. క్షేత్రస్థాయిలో ప్రజాసమస్యలు తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్ర ద్వారా గ్రామాలకు వెళుతుంటే.. దాన్ని జీర్ణించుకోలేని రాష్ట్ర మంత్రులు అసంబద్ధమైన ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ప్రజలు ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని, క్షేత్రస్థాయిలో తిరిగి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రులకు హితవు పలికారు.
ఎల్లెల్సీ నీటి కోటా సాధనలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. తుంగభద్ర డ్యాం నుంచి 600 క్యూసెక్కుల నీరు రావాల్సి ఉండగా అందులో కనీసం 250 క్యూసెక్కుల నీరు క్రమం తప్పకుండా రావడం లేదని, ఫలితంగా ఆయకట్టు ఎండుతుండడాన్ని తాము గుర్తించామన్నారు. ఎవరికీ ఉపయోగపడని టీడీపీని పతనం చేసి, అందరి శ్రేయస్సునూ కాంక్షించే వైఎస్సార్సీపీకి పట్టం కట్టేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. ఫాతిమా కళాశాల విద్యార్థులు తమకు న్యాయం చేయాలని అందోళనలు చేపడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యను కేంద్రంపై నెట్టి చేతులు దులిపేసుకుంటోందని విమర్శించారు.
సంబంధిత వార్తలు