తొందర పడొద్దు.. వేచి చూద్దాం: కేసీఆర్
తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయం తీసుకున్న తర్వాతనే పార్టీ వైఖరిపై మాట్లాడుకుందామని టీఆర్ఎస్ అధ్యక్షులు కె.చంద్రశేఖర్రావు సూచించారు. శనివారం సాయంత్రం ఆయన పార్టీ ముఖ్యులు కె.కేశవరావుతోనూ, ఆ తరువాత ముఖ్య పొలిట్బ్యూరో సభ్యులతోనూ తన నివాసంలో సమావేశమయ్యారు.
కర్నూలు, అనంతపురం జిల్లాలతో కలిపి రాయల తెలంగాణ, హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేస్తారంటూ వస్తున్న ఊహాగానాలపై తొందరపడి మాట్లాడటం మంచిది కాదని సూచించారు. గ్రేటర్ హైదరాబాద్పై అధికారాన్ని పంచుకునే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణను నేరుగా ఇవ్వకుండా రాయల తెలంగాణ, హైదరాబాద్ లేని తెలంగాణ వంటి మరే మెలికలు పెట్టినా తెలంగాణ భగ్గుమంటుందని కేసీఆర్ హెచ్చరించారు. ఏదిఏమైనా కేంద్ర ప్రభుత్వ నిర్ణయం వచ్చేదాకా వేచి చూద్దామని సూచించారు.