జగనన్న కోసం.. జనమంతా కదలి..
ప్రత్యేక పూజలు, ప్రార్థనలు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజలు
శ్రీశైలం, మహానందితో పాటు పలు ఆలయాల్లో పూజలు
భారీఎత్తున కొబ్బరికాయల సమర్పణ
జననేత త్వరగా కోలుకోవాలని ఆకాంక్ష
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు) : హత్యాయత్నం ఘటనలో తీవ్రంగా గాయపడిన ప్రతిపక్ష నేత, వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు శుక్రవారం జిల్లాలోని పలు దేవాలయాలు, మసీదులు, చర్చిల్లో ప్రత్యేక పూజలు, ప్రార్థనలు నిర్వహించారు. ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని, ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసేందుకు ఆయురారోగ్యాలు ఇవ్వాలని దేవున్ని ప్రార్థించారు. ఆళ్లగడ్డలో ఎమ్మెల్సీ గంగుల ప్రభాకరరెడ్డి కుటుంబ సమేతంగా కాళికామాత ఆలయంలో కుంకుమార్చన, అభిషేకాలు నిర్వహించారు. త్వరగా తమ అధినేత కోలుకుని పాదయాత్రను కొనసాగించాలని కోరుకున్నట్లు ఆయన చెప్పారు. పాణ్యం నియోజకవర్గ పరిధిలోని బళ్లారి చౌరస్తా ఆంజనేయస్వామి దేవాలయంలో మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్రెడ్డి ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకం చేయించి.. 101 కొబ్బరి కాయలు కొట్టారు.
కల్లూరు 19వ వార్డు పరిధిలో ఉన్న శివ మారుతి ఆలయంలో పూజలు, 20వ వార్డులో ఉన్న మసీదు, చర్చిల్లో ప్రార్థనలను పార్టీ నాయకులు ఫిరోజ్, బెల్లం మహేశ్వరరెడ్డి, అల్లిపీరా నిర్వహించారు. శ్రీశైలంలో మల్లికార్జున స్వామికి అభిషేకం, భ్రమరాంబదేవికి కుంకుమార్చన నిర్వహించారు. 516 కొబ్బరికాయలను సమర్పించారు. మహానందిలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు మహేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో మహానందీశ్వరుడికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన తదితర ప్రత్యేక పూజలు చేసి.. 101 కొబ్బరి కాయలు కొట్టారు. కోడుమూరులో నియోజకవర్గ సమన్వయకర్త మురళీకృష్ణ ఆధ్వర్యంలో మారెమ్మ, రాముల ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మసీదులో ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కర్నూలులోని బాలాజీనగర్ సాయిబాబా ఆలయంలో 101 కొబ్బరి కాయలనుసమర్పించారు.
నంద్యాలలోని అయ్యప్పస్వామి దేవాలయంలో జగన్ ప్రసాద్, ప్రథమనందినిలో సాయిరామ్రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీసీ కాలనీలోని మసీదులో కౌన్సిలర్ జాకీర్ ఆధ్వర్యంలో ప్రార్థనలు చేశారు. వంగాల భరత్కుమార్రెడ్డి, చెరకుచెర్ల సుధాకరరెడ్డి ఆధ్వర్యంలో నందికొట్కూరు చౌడమ్మ దేవాలయంలో పూజలు, మసీదుల్లో ప్రార్థనలు నిర్వహించారు. జూపాడుబంగ్లా చర్చిలోనూ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆదోనిలో అభయాంజనేయస్వామి దేవాలయంలో గోపాల్రెడ్డి ఆధ్వర్యాన ప్రత్యేక పూజలు చేశారు. స్థానిక ఫరిద్సాహెబ్ హజరత్ దర్గాలో ఫయాజ్ ఆధ్వర్యంలో ప్రార్థనలు నిర్వహించారు. పత్తికొండలో శ్రీరంగడు, బజారప్ప, భాస్కర్నాయక్ ఆధ్వర్యంలో శివాలయంలో పూజలు, మసీదు, చర్చిల్లో ప్రార్థనలు చేశారు. తుగ్గలి మండలం పెండేకల్ దర్గాలో అట్ల గోపాల్రెడ్డి, కృష్ణగిరి మండలం చుంచు ఎర్రగుడి రామలింగేశ్వర ఆలయంలో లక్ష్మీకాంతరెడ్డి, మద్దికెర మద్దమ్మ ఆలయంలో మురళీధర్రెడ్డి, ఎంపీటీసీ సభ్యులు శ్రీనివాసులు, విష్ణువు ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. కర్నూలులోని వినాయక స్వామి ఆలయంలో రియల్ టైం నాగరాజు, సాంబశివారెడ్డి, భాస్కరరెడ్డి, అశోక్కుమార్రెడ్డి, రాజేంద్రప్రసాద్నాయుడు తదితరుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. మదారపు రేణుకమ్మ, విజయకుమారి, విజయలక్ష్మీ, సలోమి, కల్పన, జమీల, శాంతిభాయ్, మేరీ, సుచరిత ఆధ్వర్యంలో వెంకాయపల్లి రేణుకా ఎల్లమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.