తెలంగాణ అభ్యంతరాలపై వివరణ ఇవ్వండి
ఏపీ ప్రభుత్వానికి కృష్ణా బోర్డు లేఖ
సాక్షి, అమరావతి: శ్రీశైలం జలాశయం నుంచి రోజుకు 6 నుంచి 8 టీఎంసీలను తరలించడానికి కొత్తగా సాగునీటి పథకాలను చేపట్టారంటూ తెలంగాణ సర్కార్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి హెచ్కే మీనా శుక్రవారం ఏపీ ప్రభుత్వానికి లేఖ రాశారు. విభజన చట్టంలోని 11వ షెడ్యూల్ పేరా–7 ప్రకారం.. కృష్ణా, గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో కొత్త ప్రాజెక్టులు చేపట్టాలంటే ముందుగా కృష్ణా, గోదావరి బోర్డులు, అపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతి తీసుకోవాలని, అందుకు భిన్నంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందంటూ తెలంగాణ సర్కార్ తమకు ఫిర్యాదు చేసిందని లేఖలో తెలిపారు.
శ్రీశైలం జలాశయంలో సంగమేశ్వరం నుంచి రోజుకు మూడు టీఎంసీలను, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్కు దిగువన ఎస్సార్బీసీ కాలువలోకి ఎత్తిపోసేలా పంపింగ్ స్కీం, పోతిరెడ్డిపాడు కాలువల సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచే పనులు చేపట్టినట్లు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసిందని ఆ లేఖలో పేర్కొన్నారు.