కిడ్నీ సమస్య పరిష్కరించండి
జగనన్న ఎదుట అంబకండి వాసుల ఆవేదన
సాక్షి ప్రతినిధి,శ్రీకాకుళం,రాజాం/రేగిడి: తమ గ్రామంలో కిడ్నీ సమస్యను పరిష్కరించాలని రేగిడి మండలం అంబకండి గ్రామానికి చెందిన కిడ్నీ బాధితులు ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ఉంగరాడ మెట్ట సమీపంలో ప్రజాసంకల్పయాత్రలో పాల్గొని జగన్మోహన్రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా పంచాయతీ మాజీసర్పంచ్ అప్పలనాయుడు మాట్లాడుతూ సుమారు 7 వేల మంది జనాభా ఉన్న తమ పంచాయతీ వైఎస్సార్ అభిమాన పంచాయతీ అని పేర్కొన్నారు. మండలంలో అన్ని గ్రామాలకు ఫిల్టర్ వాటర్ అందించే భారీ రక్షిత పథకం నీటిని తమ గ్రామానికి ఇవ్వలేదని అన్నారు. కొంతకాలంగా గ్రామంలో కిడ్నీ వ్యాధులు ప్రబలుతున్నాయని, 20 మంది వరకు బాధితులు మృతిచెందారని వాపోయారు. హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేకబృందం కిడ్నీ వ్యాధులకు తాగునీటి సమస్యే కారణమని విశ్లేషించినట్లు పేర్కొన్నారు. అనంతరం జగన్మోహన్రెడ్డి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే కిడ్నీ సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.