నీటి కష్టాలు తీర్చండి
వైఎస్ జగన్కు కేసీ కెనాల్ సాధన సమితి విజ్ఞప్తి
కర్నూలు జిల్లాలో ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డిని గురువారం రామచంద్రాపురం క్రాస్రోడ్డు వద్ద కేసీ కెనాల్ సాధన సమితి ఆధ్వర్యంలో రైతులు కలిశారు. యాలూరి రామసుబ్బారెడ్డి, తలసాని బాలిరెడ్డి, గంగుల సుభాష్రెడ్డి తదితరులు ఈ ప్రాంత రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలను విన్నవించారు. 120 కి.మీ. నుంచి 215 కి.మీ. వరకు ఉన్న కేసీ కాల్వకు ఎలాంటి నమ్మకమైన నీటి వనరు లేదని, కేవలం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్పై ఆధారపడి పంటలు సాగు చేస్తున్నారని చెప్పారు.
శ్రీశైలం జలాశయం నీటిమట్టాన్ని 854 అడుగులకు స్థిరీకరిస్తేనే ఈ ప్రాంత రైతులకు పోతిరెడ్డిపాడు ద్వారా సాగునీరు అందే అవకాశం ఉందన్నారు. శ్రీశైలంలో నీటి మట్టాన్ని 841 అడుగుల కంటే దిగువకు తగ్గిస్తూ చంద్రబాబు ప్రభుత్వం తెచ్చిన జీవో నం.69ను తక్షణమే రద్దు చేయించాలని, జిల్లాలో పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయించాలని కోరారు. జగన్ స్పందిస్తూ.. రైతుల సమస్యను పరిష్కరించడానికి కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా రైతులు జగన్కు తలపాగా చుట్టి సత్కరించారు.