రద్దీని బట్టే నడకదారి భక్తులకు శ్రీవారి దర్శనం
సాక్షి, తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీని బట్టే నడకదారి భక్తులకు శ్రీవారి దర్శనం లభించనుందని జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు స్పష్టం చేశారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వేసవి రద్దీ వల్ల శనివారం మొత్తం 44వేల మంది భక్తులు వచ్చారని, వీరికి 10 గంటల తర్వాతే శ్రీవారి దర్శనం లభిస్తోందన్నారు. నడకదారిలో వచ్చే భక్తులకు ఎట్టి పరిస్థితుల్లోనూ తక్కువ సమయంలో స్వామివారి దర్శనం కాదన్నారు. నడచివచ్చే భక్తుల సంఖ్యను బట్టి దర్శనం ఉంటుందన్నారు. రోజూ 15వేల మంది వస్తే కనీసం 4 నుండి 5 గంటల సమయం పడుతుందని, అదే సంఖ్య 30 వేలు దాటితే 10 గంటల సమయం దాటుతుందన్నారు.
ఈ విషయాన్ని గుర్తించుకుని నడకదారి భక్తులు తిరుమల రావాలన్నారు. సామాన్య భక్తులకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రాధాన్యతలు బట్టి వీఐపీ బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేశామన్నారు. ఆ సమయాన్ని కేవలం సామాన్య భక్తులు కేటాయించామన్నారు. అయినప్పటికీ దర్శన సమయం ఆలస్యం అవుతుందంటే అది కేవలం రద్దీ వల్ల మాత్రమేనన్నారు. ఈ వేసవి రోజుల్లో టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు సమష్టిగా పనిచేశారని కితాబిచ్చారు.