అంగన్‌వాడీ పోస్టులను అమ్మేస్తున్నారు

Irregularities on Anganwadi posts  - Sakshi

విజయనగరం గంటస్తంభం: అంగన్‌వాడీ పోస్టుల భర్తీలో అక్రమాలు జరుగుతున్నాయని, కార్యకర్త, ఆయా పోస్టులు అమ్ముకుంటున్నారని దత్తిరాజేరు మం డలం పెదమానాపురం గ్రామానికి చెందిన కిలుగు కుమారి గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌కు సోమవారం ఫిర్యాదు చేశారు. ఆయా పోస్టుకు రూ.5 లక్షలు, కార్యకర్త పోస్టుకు రూ.10 లక్షలకు ఎమ్మెల్యే అమ్మేశారంటూ స్థానిక పెద్దలు చెబుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అర్హత ఉన్నవారికి పోస్టులు కేటాయించేలా చూడాలని విన్నవించారు. కలెక్టరేట్‌లో జరిగిన గ్రీవె న్స్‌సెల్‌కు 215 వినతులు వచ్చాయి. కలెక్టర్‌తో పాటు జేసీ శ్రీకేష్‌ బి.లఠ్కర్, జేసీ–2 నాగేశ్వరరావు, డీఆర్వో రాజకుమార్‌లు వినతులు స్వీకరించారు. పిం ఛన్లు, భూ సమస్యలపై అధిక వినతులు రావడం విశేషం. 

రాచకిండాం ఉన్నత పాఠశాలలో పనిచేసే సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడిని ఎమ్మెల్యే కె.ఎ.నాయుడు సిరిపురం పాఠశాలకు డిప్యుటేషన్‌పై వేయించారని, దీంతో ఆ సబ్జెక్టులో తమ పాఠశాల విద్యార్థులు వెనుకబడుతున్నారని బొండపల్లి మండలం రాచకిండాం, రయింద్రాం, కిండాం ఆగ్రహారం తదితర గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై విద్యాశాఖ అధికారులను ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వద్దకు వెళ్లాలంటూ మండిపడ్డారని వాపోయారు. తక్షణమే తమ పాఠశాలకు ఉపాధ్యాయుడిని నియమించాలని, లేదంటే పాఠశాలకు తాళం వేస్తామన్నారు. 

లక్కిడాం స్టేట్‌ బ్యాంకు నుంచి ఎలాంటి రుణాలు అందడంలేదని కొండకరకాం సర్పంచ్‌ ఎం.గౌరునాయుడు, గ్రామస్తులు ఫిర్యాదు చేశారు.  పంట రుణాలు అడిగినా ఇవ్వడం లేదని వాపోయారు. రుణాలు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు.  

గరివిడి మండల గొట్నందలో సర్వే నంబర్‌ 107/9, 107/11లో ఉన్న 3.5ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమణలను నిరోధించాలని గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. 

తాటిపూడిలో బోటు షికారుకు అనుమతివ్వాలని నిర్వాహకులు కలెక్టర్‌ను కోరారు. తమ వద్ద అనుమతులున్నాయని, నడిపేందుకు అవసరమైన శిక్షణ పొందామని వివరించారు. 18ఏళ్లుగా నడుపుతున్నామని, ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. ప్రస్తుతం సీజన్‌ కావడంతో పర్యాటకులు ఎక్కువమంది వస్తున్నారని, బోటు షికారు లేకపోవడం వల్ల నష్టపోతున్నామన్నారు. ప్రభుత్వం అమలుచేసే కొత్త నిబంధనల ప్రకారం అనుమతులు పొంది నడుపుకోవాలని కలెక్టర్‌ సూచించారు.

ఎస్పీ గ్రీవెన్స్‌సెల్‌కు 30 ఫిర్యాదులు
విజయనగరం టౌన్‌:  జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన  గ్రీవెన్స్‌సెల్‌కు 30 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ జి.పాలరాజు ఫిర్యాదులు స్వీకరించారు. పరిష్కారం చూపించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ వై.వి.శేషు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని... 
 భర్త, అత్తమామలు అదనపు కట్నం తేవాలని తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని విజయనగరం పట్టణానికి చెందిన లలిత ఎస్పీ జి.పాలరాజుకు సోమవారం ఫిర్యాదు చేసింది.

♦ తను ఒక అమ్మాయిని ప్రేమించానని, ఇద్దరమూ మేజర్లమని, పెళ్లి చేయాల్సిందిగా పూసపాటిరేగ మండలానికి చెందిన నరేష్‌ ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

 తండ్రికి చెందిన ఆస్తిని పెద్దన్నయ్య స్వాధీనం చేసుకున్నాడని, న్యాయం చేయాలంటూ మెంటాడ మండలానికి చెందిన కృష్ణమూర్తి విన్నవించాడు. 

భర్త మరణానంతరం ఫోర్జరీ సంతకాలతో ఆస్తినంతా రెండో భార్య స్వాధీనం చేసుకుందని, న్యాయం చేయాలంటూ సీతానగరం మండలానికి చెందిన మహాలక్ష్మి ఎస్పీకి విన్నవించింది. 

పూర్వీకుల నుంచి వచ్చిన ఆస్తిని వేరే వ్యక్తలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారని తెర్లాం మండలానికి చెందిన సత్యం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 

♦ తన భర్త శారీరకంగా, మానసికంగా హింసిస్తూ.. హత్యచేసేందుకు ప్రయత్నిస్తున్నాడని ఎస్‌.కోటకు చెందిన మాధవి ఎస్పీకి ఫిర్యాదు చేసింది.

♦ తెర్లాం మండలానికి చెందిన గర్భాపు రాము, యందవ ప్రసాద్‌లు తనకు ఐదేళ్లలో  రూ.50 లక్షలు ఇస్తామని నమ్మించి అభ్యతి గ్రూప్‌ పేరుతో బాండు పేపరిచ్చారని, నేడు కాలపరిమితి అయిపోయినా డబ్బులు చెల్లించకుండా తిప్పుతున్నారని, సదరు కంపెనీ బోగస్‌దిగా తేలిందని, న్యాయం చేయాలంటూ అదే మండలానికి చెందిన ఉషారాణి విన్నవించింది. 

♦ మెడలోని చైన్‌ను ఓ కుర్రాడు తెంపుకుని పారిపోయాడని పట్టణానికి చెందిన ఓ మహిళ  ఎస్పీకి ఫిర్యాదుచేసింది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top