ఏపీకి 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు: సీఎం

Investments to AP - Sakshi

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పటివరకూ 20 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని సీఎం  చంద్రబాబు చెప్పారు. ఆటోమొబైల్‌ రంగంలోనే 5 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను ఆకర్షించినట్లు తెలిపారు. అపోలో, కియా, అశోక్‌ లేలాండ్, భారత్‌ ఫోర్జ్‌ లాంటి ఆటోమొబైల్‌ పరిశ్రమలు, ఫాక్స్‌కాన్‌ తదితర మొబైల్‌ పరిశ్రమలు వచ్చాయన్నారు.

సింగపూర్‌లో పర్యటిస్తున్న చంద్రబాబు శుక్రవారం హిందూస్థాన్‌ టైమ్స్‌ మింట్‌ ఆసియా లీడర్‌షిప్‌ సమ్మిట్‌కు హాజరయ్యారు.  సదస్సులో పలు ప్రశ్నలకు బాబు సమాధాన మిచ్చారు.దక్షిణాది రాష్ట్రాల పట్ల కేంద్రం వివక్ష అవలంబిస్తోందా? అన్న ప్రశ్నకు  దీనిపై చర్చించడానికి ఇది సరైన వేదిక కాదని చెప్పారు. తొలుత సింగపూర్‌ వాణిజ్య, పరిశ్రమల మంత్రి ఈశ్వరన్‌తో  ప్రత్యేకంగా  సమావేశం జరిపారు.

టోనీ బ్లెయిర్‌తో సమావేశం : బ్రిటన్‌ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్‌తో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. టోనీ బ్లెయిర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్లోబల్‌ ఛేంజ్‌ కార్యకలాపాలను విస్తరించేందుకు త్వరలో ఏపీకి తమ బృందాన్ని పంపిస్తామని చెప్పారు. క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండుల్కర్‌ను కూడా  సీఎం కలుసుకున్నారు.

సింగపూర్‌ బిజినెస్‌ ఫెడరేషన్‌ (ఎస్‌.బి.ఎఫ్‌) సీఈవో ఓ హో మెంగ్‌ కిట్‌తో భేటీ అయ్యారు. టాటా సన్స్‌ బోర్డు చైర్మన్‌ నటరాజన్‌ చంద్రశేఖరన్‌తోనూసీఎం చర్చించారు. సింగపూర్‌ ప్రభుత్వ రాయబారి గోపీనాథ్‌ పిళ్లైని కలసి జూలై, నవంబరులో జరిగే  సమావేశాలకు హాజరు కావాలని చంద్రబాబు కోరారు.

రాష్ట్రాభివృద్ధికి కేంద్రం అడ్డుపడుతోంది
సింగపూర్‌లోని తెలుగువారితో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ అసూయ, అసంతృప్తి, ఈర‡్ష్యకు గురైందని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడుతూసహాయ నిరాకరణ చేస్తోందన్నారు. గుజరాత్‌లో ఒక విగ్రహం నెలకొల్పడానికి మోదీ రూ.2,500 కోట్లు వ్యయం చేశారని, ఏపీ రాజధాని నిర్మాణానికి మాత్రం రూ.1,500 కోట్లే ఇచ్చారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top