క్రికెట్ పండుగ వచ్చిందే..
నేటి నుంచి న్యూజిలాండ్, ఇండియా–ఎ జట్ల మధ్య టెస్ట్ క్రికెట్ మ్యాచ్
ముస్తాబైన మూలపాడు క్రికెట్ మైదానం
గెలుపుపై ఎవరి ధీమా వారిదే..
క్రికెట్ అభిమానులకు పెద్ద పండుగ రానే వచ్చింది.. పెద్ద నగరాలకే పరిమితమైన మ్యాచ్లు గ్రామీణ ప్రాంతమైన మూలపాడులో కూడా జరుగనుండడంతో అభిమానులు ఆనందానికి హద్దే లేకుండాపోయింది. దసరా కంటే ముందే పండుగ వచ్చిందే.. అంటూ సందడి చేస్తున్నారు. మ్యాచ్ ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
విజయవాడ స్పోర్ట్స్: ఇండియా–ఎ, న్యూజిలాండ్–ఎ జట్ల మధ్య ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు క్రికెట్ మైదానంలో శనివారం నుంచి టెస్ట్ క్రికెట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఇందుకోసం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అన్ని ఏర్పాట్లు చేసింది. శుక్రవారం ఇరు జట్లు ప్రాక్టీస్ చేశాయి. గతేడాది చివరిలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ వెస్ట్ండీస్ మహిళా జట్టుతో మూడు వన్డేలు, మూడు టీ20 క్రికెట్ మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించిన విషయం విధితమే.
దీంతో ఇండియా–ఎ, న్యూజిలాండ్–ఎ జట్ల మధ్య ఏకంగా రెండు టెస్ట్ (ఫోర్డేస్) మ్యాచ్లు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వడం విశేషం. టీమిండియాలోకి రాబోయే వర్థమాన క్రికెటర్లతో ఆడే ఈ మ్యాచ్లకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. దసరా సెలవుల నేపథ్యంలో శనివారం నుంచి 26వ తేదీ వరకు మొదటి టెస్ట్ మ్యాచ్ క్రికెట్ ప్రేమికులకు, యువతకు మంచి పండుగే అని చెప్పవచ్చు. ఈ నెల 30 నుంచి అక్టోబరు 3వ తేదీ వరకు రెండో టెస్ట్ మ్యాచ్ జరుగనుంది.
ఉదయం 8.45కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఇరు జట్లకు పోలీస్ శాఖ పూర్తి భద్రత కýల్పిస్తోంది. శుక్రవారం మైదానం మొత్తం డాగ్ స్క్వాడ్తో తనిఖీలు చేశారు. ఏసీఏ ప్రధాన కార్యదర్శి సిహెచ్.అరుణ్కుమార్, సెంట్రల్ జోన్ కార్యదర్శి కోకా రమేష్, మీడియా మేనేజర్ సి.ఆర్.మోహన్, క్యూరెటర్, జిల్లా కార్యదర్శి ఎ.యల్లారావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఇరు జట్ల కెప్టెన్లు, మేనేజర్లు పిచ్పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఇండియా ఎ జట్టుకు రాహుల్ ద్రావిడ్, న్యూజిలాండ్ జట్టుకు షేన్ బాండ్ ప్రధాన కోచ్లుగా వ్యవహరిస్తున్నారు.
సిరీస్ను తేలికగా తీసుకోం
న్యూజిలాండ్–ఎతో జరిగే సిరీస్ను తేలికగా తీసుకోం. సౌత్ ఆఫ్రికా పర్యటన తర్వాత భారత జట్టు ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరింత పెరిగింది. చక్కని బ్యాటింగ్ లైనప్, పటిష్టమైన బౌలింగ్తో జట్టు సమతుల్యంగా ఉంది. ఈ సిరీస్ ప్రతి మ్యాచ్, ప్రతి ఇన్నింగ్స్ కీలం. మ్యాచ్లు గెలిచేందుకు శాయశక్తులా కృషి చేస్తాం. మూలపాడు మైదానం చాలా బాగుంది. చక్కటì ఔట్ ఫీల్డ్, పిచ్ కూడా బాగుంది. – కరుణ్నాయర్, ఇండియా–ఎ జట్టు కెప్టెన్
భారత్ను నిలువరిస్తాం
ఇండియా జట్టు బ్యాటింగ్, బౌలింగ్ రెండింటిలోనూ బాగుంది. సౌత్ ఆఫ్రికా సిరీస్ తర్వాత భారత జట్టులో ఆటగాళ్లు మంచి ఉత్సాహంతో ఉన్నారు. సిరీస్ గెలిచేందుకు గట్టి పోటీ ఇస్తాం. బ్యాటింగ్, బౌలింగ్ లైనప్ మాది కూడా బాగుంది. బంతి వేగంగా బ్యాట్పైకి వస్తోంది. ఔట్ ఫీల్డ్, పిచ్ చాలా బాగున్నాయి. చుట్టు పక్కల వాతావరణం అద్భుతం.
–హెన్రీ నికోల్స్, న్యూజిలాండ్ కెప్టెన్
చివరి రోజు స్పిన్నర్లకు అనుకూలం
పిచ్ చాలా బాగా తయారు చేశాం. బంతి బాగా లేస్తోంది. స్పీడ్ ఉంది. మీడియం పేసర్లతో పాటు చివరి రోజు స్పిన్నర్లకు అనుకూలించవచ్చు. ఈ పిచ్ మంచి ఫలితాన్ని ఇస్తుందన్న నమ్మకం ఉంది. ఇరు జట్ల కెప్టెన్లు పిచ్ గురించి మంచి కితాబు ఇచ్చారు. – ఎ.యల్లారావు, పిచ్ క్యూరెటర్
నమ్మకాన్ని నిలబెట్టుకుంటాం
భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) మా మీద ఉంచిన నమ్మకాన్ని వమ్ముచేయం. ఇంతకు ముందు వెస్ట్ండీస్ మహిళా జట్టుతో జరిగిన మ్యాచ్లు విజయవంతంగా నిర్వహించడంతో న్యూజిలాండ్తో టెస్ట్ మ్యాచ్లకు బీసీసీఐ అవకాశం ఇచ్చింది. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో మ్యాచ్లకు అవకాశం లేదు.
ఆరు నెలలు పాటు స్టేడియం అప్పగించడంతో పాటు కనీసం రూ.50 కోట్లు ఖర్చుపెడితే మినహా ఇంటర్నేషనల్ క్రికెట్ మ్యాచ్లకు అవకాశం లేదు. మంగళగిరిలో 23 ఎకరాల్లో అడ్వాన్స్›డ్ అంతర్జాతీయ క్రికెట్ ప్రమాణాలతో వరల్డ్ క్లాస్ క్రికెట్ స్టేడియం సిద్ధమవుతోంది. 2019–20 క్రికెట్ సీజన్ నాటికి ఐపీఎల్ మ్యాచ్లు మంగళగిరి స్టేడియంలో జరుగుతాయని ఆశిస్తున్నాం.
–సిహెచ్.అరుణ్కుమార్, ఏసీఏ ప్రధాన కార్యదర్శి