మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి..సార్
కోవెలకుంట్ల: ఇంటికో ఉద్యోగం లేదా నిరుద్యోగ భృతి అని ఎన్నికలప్పుడు హామీ ఇచ్చి..అధికారంలోకి వచ్చాక తెలుగుదేశం ప్రభుత్వం ఉన్న ఉద్యోగాలను పీకేసిందని పలువురు ఆదర్శ రైతులు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం కోవెలకుంట్ల మండలం కంపమల్ల మెట్ట వద్ద ఆదర్శ రైతుల సంఘం మండల అధ్యక్షుడు శివశంకర్రెడ్డి ఆధ్వర్యంలో పాదయాత్రగా వస్తున్న వైఎస్ జగన్ను కలిశారు. నాడు వైఎస్ఆర్ ఆదర్శ రైతులను నియమిస్తే చంద్రబాబు తమను తొలగించి కుటుంబాలను రోడ్డున పడేశారని వాపోయారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆదర్శరైతులకు న్యాయం చేస్తామని జగన్ భరోసా ఇచ్చారు.
గోపాలమిత్రలు..
కోవెలకుంట్ల: పశుగణాభివృద్ధి సంస్థలో 16 ఏళ్లుగా పాడి రైతులకు సేవలందిస్తున్నా తమకు ఉద్యోగ భద్రత లేదని, నెలవారీ వేతనం కూడా సక్రమంగా అందడం లేదని పలువురు గోపాల మిత్రలు శనివారం వైఎస్జగన్ను కలిసి విన్నవించుకున్నారు.
ఉపాధ్యాయుల సమస్యలపై వినతి
కోవెలకుంట్ల: ప్రజా సంకల్పయాత్ర శనివారం కోవెలకుంట్లకు చేరుకోగా రాష్ట్ర ఉపాధ్యాయ జాతీయ పరిషత్ జిల్లా ప్రధాన కార్యదర్శి షరీఫ్, ఏపీటీఎఫ్ జిల్లా జనరల్ సెక్రటరీ ఖాజాహుసేన్, సీపీఎస్ సంఘం నాయకులు చిన్న షరీఫ్, సతీష్కుమార్, శ్రీనివాస్, సునీల్, మదన్, సురేష్, వేణుగోపాల్ తదితరులు వైఎస్ జగన్ను కలిసి ఉపాధ్యాయ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రూ.398 వేతనంతో పని చేసిన స్పెషల్ టీచర్లకు నోషనల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, నూతన సీపీఎస్ విధానం రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని విన్నవించారు. ఉపాధ్యాయ సమస్యలపై జగన్ సానుకూలంగా స్పందించారు.
మమ్మల్ని తీసేస్తారంటన్నా..
ఆళ్లగడ్డ: ‘ఈ ప్రభుత్వం మమ్మల్ని డిసెంబరు వరకు మాత్రమే ఉద్యోగాల్లో కొనసాగిస్తుందంటన్నా.. తరువాత తొలగిస్తారట’ అని సుమారు 17 మండలాల సాక్షరభారత్ ఎంసీఓల సంఘం నాయకులు వైఎస్జగన్ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారు. వారి సమస్యలు విన్న తరువాత స్పందిస్తూ ‘కోర్టుకు వెళ్లండి నేను కూడా మీ తరఫున పోరాటం చేస్తా’ అని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే భద్రత కల్పిస్తామని వారికి భరోసా కల్పించారు. నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్న సాక్షరభారత్ కార్యకర్తలకు ఏడాదికి ఒక్కసారి మాత్రమే జీతాలు ఇస్తున్నారని వారు వాపోయారు. సాక్షర్భారత్ ఎంసీఓల సంఘం నాయకులు జర్మియా, రామకృష్ణుడు తదితరులు ఆయనకు వినతిపత్రం అందజేశారు.