భార్యపై భర్త యాసిడ్‌ దాడి

Husband Acid Attack on His Wife - Sakshi

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు

పరారీలో నిందితుడు   

నెల్లూరు జిల్లా / వెంకటాచలం: వేరే ప్రాంతానికి కాపురానికి రాలేదనే కోపంతో భార్యపై భర్త యాసిడ్‌ దాడిచేసిన ఘటన మండలంలోని కసుమూరులో శుక్రవారం జరిగింది. తీవ్ర గాయాలతో కేకలు వేయడంతో స్థానికులు గుర్తించి బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. పోలీసుల సమాచారం మేరకు.. పొదలకూరు పట్టణం గేటు సెంటర్‌కు చెందిన షేక్‌ కరీంబాషా నెల్లూరు నగరం మన్‌సూద్‌నగర్‌కు చెందిన షబానాను ఆరేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరికీ ఇది రెండో వివాహం. కరీంబాషాకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. షబానాకు తొలుత పెళ్లయి ఒక కుమారుడు ఉన్నాడు. కరీంబాషాతో పెళ్లయి తర్వాత వీరిక ఒక కుమార్తె జన్మించింది.

అయితే కరీంబాషా మొదటి భార్య తరచూ వీరిద్దరి వివాహంపై గొడవ చేస్తోంది. దీంతో మన్‌సూద్‌నగర్‌లో ఉంటున్న షబానాను తీసుకుని దూరంగా ఇతర ప్రాంతానికి వెళ్లిపోదామని కరీంబాషా వత్తిడి తెచ్చేవాడు. తల్లిదండ్రుల వద్ద నుంచి తాను రానని షబానా చెప్పడంతో గొడవకు దిగేవాడు. ఈ క్రమంలో గురువారం షబానాతోపాటుగా కుమార్తెను తీసుకుని కసుమూరు దర్గాకు వచ్చాడు. స్థానికంగా ఉన్న ఓ లాడ్జిలో రూం తీసుకుని రాత్రి అక్కడే ఉన్నారు. శుక్రవారం ఉదయం 10 గంటల సమయంలో వేరే ప్రాంతానికి కాపురం వెళ్లే విషయంపై ఇద్దరి మధ్య తీవ్రవాగ్వాదం జరిగింది.

దీంతో కరీంబాషా తన వెంట తీసుకు వచ్చిన యాసిడ్‌ను షబానాపై చల్లి అక్కడ నుంచి పరారయ్యాడు. యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలైన షబానా పెద్దగా కేకలు వేయడంతో స్థానికులు అక్కడకు చేరుకుని ఆమెను ఆటోలో జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. శరీరంపై తీవ్ర గాయాలవడంతో షబానా ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంది. ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.విషయం తెలుసుకున్న సీఐ శ్రీనివాసరెడ్డి తొలుత కసుమూరుకు వెళ్లి యాసిడ్‌ దాడిపై విచారణ చేశారు. ఆ తర్వాత ఆస్పత్రికి వెళ్లి బాధితురాలిని విచారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top