రాజధాని కోసం ఏపీ సచివాలయంలో హుండీ

రాజధాని కోసం ఏపీ సచివాలయంలో హుండీ - Sakshi


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాజధాని ఎలా ఉండాలో పరిశీలించేందుకు ఇద్దరు మంత్రులు సహా ఓ బృందాన్ని కొన్నాళ్ల పాటు సింగపూర్ పంపుతున్న ప్రభుత్వం.. తాజాగా ఈ రాజధాని నిర్మాణం కోసం ఏకంగా హుండీలు పెట్టేసింది. కొత్త రాష్ట్రానికి సరిపడగా డబ్బులు లేవని, బోలెడన్ని అప్పుల్లో మునిగిపోయామని చెబుతున్న టీడీపీ ప్రభుత్వం ఇప్పటికే అనేక వర్గాల నుంచి భారీ ఎత్తున విరాళాలు సేకరించింది. అవి ఎంత అయ్యాయనే విషయాన్ని మాత్రం ఇంతవరకు ఎక్కడా వెల్లడించలేదు. కానీ ఇప్పుడు మళ్లీ మరోసారి విరాళాల కోసం జోలె పట్టేసింది. స్టీలుతో తయారుచేసిన భారీ హుండీ ఒకదాన్ని సచివాలయంలోని ఎల్ బ్లాకులో ఏర్పాటుచేశారు.



రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు ఉండే ఈ బ్లాకుకు సందర్శకులు కూడా భారీ సంఖ్యలోనే వస్తుంటారు. అందుకే ఇక్కడ హుండీ ఏర్పాటుచేసినట్లు తెలుస్తోంది. మరో రెండు హుండీలను కూడా ఇలాంటివాటిని తయారు చేయించారు. వాటిలో ఒకదాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలోను, మరొకదాన్ని లేక్వ్యూ అతిథి గృహంలోను పెడుతున్నారు. అయితే, ఈ వైఖరిపై మాత్రం తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. ఎల్ బ్లాకు, హెచ్ బ్లాకులలో మరమ్మతులు, వాస్తు పేరిట మార్పు చేర్పుల కోసం దాదాపు 20 కోట్లు ఖర్చు చేశారు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్యేల శిక్షణ కూడా ప్రైవేటు హోటల్లో ఏర్పాటుచేశారు తప్ప అసెంబ్లీ ఆవరణలోనో, మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల శిక్షణ కేంద్రంలోనో మాత్రం ఏర్పాటుచేయలేదు. ఇలా ఒకపక్క దుబారా చేస్తూ మరోపక్క రాజధాని కోసం అంటూ విరాళాల సేకరణ ప్రారంభించడం ఏంటన్న విమర్శలు వస్తున్నాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top