జగన్ యాత్రకు పోటెత్తుతున్న జనం
పీఎంవోకు ఐబీ నివేదిక
ప్రజా సంకల్ప పాదయాత్రపై జాతీయ పార్టీల్లో చర్చ
న్యూఢిల్లీ: ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు, చంద్రబాబు అప్రజాస్వామిక విధానాలు ఎండగట్టడమే లక్ష్యంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర వివరాలను ప్రధానమంత్రి కార్యాలయం ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నట్లు సమాచారం. పాదయా త్రను ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రజాసంకల్పయాత్రకు జనం భారీ ఎత్తున హాజరవుతున్న విషయాన్ని ఐబీ అధికారులు ప్రధాని కార్యాలయానికి నివేదిస్తున్నట్లు తెలుస్తోంది.
జగన్ పాదయాత్రకు వస్తున్న అనూహ్య స్పందనపై వివిధ జాతీయ పార్టీలు అంతర్గతంగా చర్చించుకుంటున్నట్లు తెలుస్తోంది. బీజేపీ కేంద్ర కార్యాలయం మీడియా ఇన్చార్జ్ సంజయ్ మాయక్ స్పందిస్తూ పాదయాత్ర సమాచారం ఉందని తెలిపారు. ఏఐసీసీ కేంద్రకార్యాలయం మీడియా ఇన్చార్జ్ రణ్దీప్ సింగ్ సూర్జేవాలా మాట్లాడుతూ ప్రజా సంకల్పయాత్రకు సంబంధించి తమకు పూర్తి సమాచారం ఉందన్నారు. అయితే పాదయాత్రకు పెద్ద ఎత్తున జనం హాజరుకావడంపై మాట్లాడేందుకు బీజేపీ, కాంగ్రెస్ నేతలు నిరాకరించారు. పాదయాత్రలో జగన్ ప్రస్తావించిన సమస్యలకు సంబంధించి రాష్ట్ర కార్యవర్గం నుంచి నివేదిక తెప్పించుకోనున్నట్లు సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు.