హోంగార్డుల సేవలు అభినందనీయం
గుంటూరు క్రైం: పోలీసులకు ధీటుగా హోంగార్డులు సేవలు అందిస్తుండటం అభినందనీయమని రూరల్ జిల్లా అదనపు ఎస్పీ గోళ్ళ రామాంజనేయులు చెప్పారు. స్థానిక పోలీస్ పేరెడ్ గ్రౌండ్లో శనివారం 52వ హోంగార్డుల ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. హోంగార్డుల నుంచి ఆయన గౌరవ వందనం స్వీకరించారు. శాంతి కపోతాలను, బెలున్లను ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ అత్యవసర సమయాల్లో సైతం పోలీసులకు సమానంగా హోంగార్డులు సేవలు అందిస్తున్నారని చెప్పారు. అనారోగ్యం పాలైన వారికి ప్రభుత్వం నుంచి రూ.10వేలు వడ్డీ లేని రుణం, హోంగార్డు వె ల్ఫేర్ ఫండ్ నుంచి రూ.5వేలు నగదు అందజేస్తామన్నారు.
హోంగార్డు కుటుంబాల్లో డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేస్తున్న విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. వివిధ పోటీలలో, విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ఆయన బహుమతులు అందజే శారు. అనంతరం హోంగార్డుల ర్యాలీని ఆయన ప్రారంభించారు. ర్యాలీ నగరంలో కొనసాగింది. కార్యక్రమంలో డీఎస్పీలు కె.నరసింహా, జి. లక్ష్మయ్య, ప్రసాద్, ఆర్ఐ థామస్రెడ్డి, హోంగార్డ్ ఆర్ఐలు సుంకరయ్య, కె.చంద్రశేఖర్, విజయసారథి, ఆంజనేయులు ఏఆర్ ఎస్సైలు మస్తాన్, నరసింహరావు తదితరులు పాల్గొన్నారు.