హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ
సాక్షి, హైదరాబాద్: హైకోర్టులో టీటీడీకి ఎదురుదెబ్బ తగిలింది. వంశపారంపర్య అర్చకులను పదవీ విరమణ లేకుండా కొనసాగించాలని హైకోర్టు గురువారం టీటీడీని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే.. తిరుమల, తిరుచానూరు, గోవిందరాజస్వామి ఆలయాల్లో సేవలు చేస్తున్న వంశపారంపర్య అర్చకులపై టీటీడీ పదవీ విరమణ నిబంధనలను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. తిరుమల ప్రధాన అర్చకులుగా కొనసాగిన రమణ దీక్షితులను టీటీడీ పదవీ విరమణ నిబంధనలను చూపి విధుల నుంచి తొలగించింది.
టీటీడీ అమలు చేస్తున్న ఈ నిబంధనలను తొలగించాలని ఏబీ శేషాద్రి ఆచార్యులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన న్యాయస్థానం టీటీడీ నిర్ణయాన్ని తప్పుపట్టింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయంలో తీసుకొచ్చిన 33/2007 చట్ట ప్రకారం తిరుమల అర్చకులకు వంశపారంపర్య అర్చకత్వం చేసే హక్కు ఉందని కోర్టు తెలిపింది. హైకోర్టు నిర్ణయం పట్ల వంశపారంపర్య అర్చకులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.