ఏసీబీ వలలో అవినీతి చేప

ఏసీబీ వలలో అవినీతి చేప - Sakshi


 హనుమంతునిపాడు, న్యూస్‌లైన్ : మండలంలో విద్యుత్‌శాఖ ఏఈగా పని చేస్తున్న ఎం.శివకుమార్‌రెడ్డి ఓ రైతు నుంచి కనిగిరి   విద్యుత్   సబ్‌స్టేషన్‌లో రూ. 10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ పీజే జయరాజ్ గురువారం రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.



వివరాలు.. మండల కేంద్రం హనుమంతునిపాడుకు చెందిన రైతు పోలిచెర్ల నాగయ్య, ఆయన సోదరుడు కేశవులు కలిసి హాజీపురంలోని తమ పోలంలో ఏడాది క్రితం ట్రాన్స్‌ఫార్మర్ వేయించుకున్నారు. అందులో భాగంగా డీడీ కూడా కట్టారు. ఎస్టీమేట్ వేసి ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలని ఏఈ శివకుమార్‌రెడ్డిని కోరారు. ఆయన అందుకు లంచం డిమాండ్ చేశాడు. అంతేకాకుండా ఏడాది నుంచి రైతులను తన కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నాడు.

 

ఈ నేపథ్యంలో బాధితులు సీపీఎం నాయకుడు పి.కేశవరావు సహకారంతో ఒంగోలులోని ఏసీబీ డీఎస్పీ పీజే జయరాజును కలిశారు. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అప్రమత్తమయ్యారు. గురువారం కనిగిరి విద్యుత్ సబ్‌స్టేషన్‌లో రైతు నాగయ్య నుంచి ఏఈ శివకుమార్‌రెడ్డి రూ.10 వేల లంచం తీసుకుంటుండగా ఏసీబీ డీఎస్పీ తన సిబ్బందితో కలిసి దాడి చేసి ఏఈని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏఈ శివకుమార్‌రెడ్డిపై పీసీ యాక్ట కింద కేసు నమోదు చేశారు. దాడిలో ఏసీబీ ఇన్‌స్పెక్టర్లు కృపారావు, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

 

గత్యంతరం లేకే ఏసీబీని ఆశ్రయించా : నాగయ్య, బాధిత రైతు

మా పొలంలో ట్రాన్స్‌ఫార్మర్ బిగించాలని తొమ్మిది నెలల నుంచి ఏఈ చుట్టూ తిరుగుతున్నా. ఆయన తొలుత రూ.25 వేలు డిమాండ్ చేశాడు. తొమ్మిది నెలల క్రితం రూ.10 వేలు ఇచ్చా. అయినా ట్రాన్స్‌ఫార్మర్ బిగించలేదు. ఆయన్ను బతిమాలితే మరో రూ.15 వేలు డిమాండ్ చేశాడు. గత్యంతరం లేక ఏసీబీ అధికారులను ఆశ్రయించా.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top