అన్నా...నీవే ఉద్యోగ భద్రత కల్పించాలి...
విజయనగరం :ప్రజా సంకల్ప యాత్ర బృందం: రెండు దశాబ్దాలుగా అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తూ ఉద్యోగ భద్రత లేకుండా జీవిస్తున్నామని...అన్నా..నీవే మాకు దిక్కు..మీరు ముఖ్యమంత్రి కాగానే టైం స్కేల్ విధానం అమలు చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని’ వైఎస్ జగన్మోహన్రెడ్డిని శ్రీవిశ్వస్వరూప వాటర్ సప్లై ఎలక్ట్రికల్ వర్కర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్.రామారావు, కార్యదర్శి ఎస్.ఈశ్వరరావు కోరారు.
ప్రజా సంకల్ప యాత్రలో ఎల్.కోట మండలంలోని మల్లివీడు వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో జగన్మోహన్రెడ్డిని వీరు కలిశారు. విశాఖపట్నం మహానగరపాలక సంస్థ పరిధిలో తాగునీటి సరఫరా విభాగంలో 1100 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పని చేస్తున్నట్టు చెప్పారు. అందులో భాగంగా తాటిపూడి జలాశయం నుంచి ఎస్.కోట నియోజకవర్గం పరిధిలో కృష్ణాపురం యూనిట్ పరిధిలో 36 మంది అవుట్సోర్సింగ్ విధానంలో 20 ఏళ్లుగా పని చేస్తున్నట్టు తెలిపారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తమకు కష్టాలు ప్రారంభమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించి బతుకులు మార్చాలని కోరారు.