సీఎం జగన్ రాక కోసం..
28న విశాఖ పర్యటనలో ఘనస్వాగతం పలకనున్న ఉత్తరాంధ్ర
24 కిలోమీటర్ల మానవహారంతో అభినందన మాల
ఏర్పాట్లు పర్యవేక్షించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి
సాక్షి, విశాఖపట్నం: ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖను ప్రకటించి.. ఉత్తరాంధ్ర అభివృద్ధి ప్రదాతగా చెరగని స్థానం సంపాదించుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఘన స్వాగతం పలికేందుకు ఆ ప్రాంత ప్రజలు సన్నద్ధమవుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అన్నారు. రాజధాని ప్రకటన తర్వాత తొలిసారి విశాఖ పర్యటనకు వస్తున్న సీఎంకు 24 కిలోమీటర్ల మేర మానవ హారంగా ఏర్పడి అభినందన మాల అందించాలని ప్రజలు, పార్టీ శ్రేణులు నిర్ణయించాయని వెల్లడించారు. విమానాశ్రయం నుంచి కైలాసగిరి వరకు, కైలాసగిరి నుంచి బీచ్ రోడ్డు వరకు అడుగడుగునా ‘థాంక్యూ సీఎం’ పేరుతో కృతజ్ఞతలు చెబుతారని చెప్పారు.
సీఎం పర్యటన, విశాఖ ఉత్సవ్ నిర్వహణపై కలెక్టరేట్లో గురువారం అధికారులు, పార్టీ శ్రేణులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సీఎంకు స్వాగతం పలికే కార్యక్రమంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంతో పాటు ఉభయ గోదావరి జిల్లాల ప్రజలు భాగస్వాములవుతున్నారని తెలిపారు. మానవహారం కార్యక్రమానికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ వినయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్కే మీనా, జీవీఎంసీ కమిషనర్ జి.సృజనకు సూచించారు. ఈ నెల 28న వీఎంఆర్డీఏ(విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ)కి సంబంధించి రూ.379.82 కోట్లు, జీవీఎంసీ(గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్)కి సంబంధించి రూ.905.50 కోట్ల పనులకు జగన్ శంకుస్థాపనలు, ప్రారం¿ోత్సవాలు చేస్తారని చెప్పారు. అనంతరం విశాఖ ఉత్సవ్లో ముఖ్యమంత్రి పాల్గొంటారని తెలిపారు.