లైంగిక వేధింపులపై సర్కారు సమరం

Government fight over Molestation Attacks - Sakshi

సీఎం జగన్‌ స్పూర్తితో ‘పశ్చిమ’లో ప్రచారోద్యమం 

సచివాలయంలో హెల్ప్‌లైన్‌ ఏర్పాటు 

బాలల లైంగిక దాడులకు వ్యతిరేకంగా రాష్ట్ర ఫోరమ్‌ ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ ప్రయత్నం 

రాష్ట్రవ్యాప్త చైతన్యం కోసం మంత్రి వనితను కోరిన ప్రతినిధి బృందం 

దేశవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తున్న లైంగిక వేధింపులు 

బాలికలపై లైంగిక వేధింపులను సీరియస్‌గా తీసుకున్న సుప్రీంకోర్టు 

సాక్షి, అమరావతి: ఆధునిక సమాజంలో రోజురోజుకూ మానభంగ పర్వాలు పెరిగిపోతున్నాయి. అపర దుశ్శాసన, కీచకుల ‘క్రీడ’లకు లెక్కేలేదు. సభ్య సమాజం తలదించుకునేలా రోజురోజుకూ అత్యాచారాలు, అఘాయిత్యాలు పెరిగిపోతుండటాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం సీరియస్‌గా తీసుకుంది. ఇదే అంశాన్ని తీవ్రంగా పరిగణించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వాటిని అరికట్టాలని, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇటీవల హోంమంత్రి, డీజీపీలను ఆదేశించారు. వెనువెంటనే రంగంలోకి దిగిన వారు ఈ నేరాలకు చెందిన ఫిర్యాదులను స్వీకరించి, చర్యలు చేపట్టడానికి రాష్ట్ర సచివాలయంలో ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు. తమవంతు కర్తవ్యంగా స్వచ్ఛంద సంస్థలు నడుం బిగించాయి.  

బాలికలు, మహిళలపై లైంగిక దాడులను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలను స్ఫూర్తిగా తీసుకుని పశ్చిమగోదావరి జిల్లాలో ప్రచారోద్యమాన్ని చేపట్టినట్టు బాలల హక్కుల కార్యకర్త టీఎన్‌ స్నేహన్‌ సాక్షి ప్రతినిధికి వెల్లడించారు. వరల్డ్‌ విజన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సౌజన్యంతో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఫోరం ఫర్‌ చైల్డ్‌ రైట్స్‌ సంస్థ ద్వారా ‘బాలలపై దాడుల వ్యతిరేక ప్రచారోద్యమం’ చేపట్టినట్టు ఆయన చెప్పారు. ఈ ప్రచారోద్యమ కార్యక్రమాన్ని మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత చేతుల మీదుగా ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించాలని మంత్రిని కోరారు. బాలికలు లైంగిక దాడుల బారిన పడకుండా ఎలా తప్పించుకోవాలన్న దానిపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను, పోస్టర్లను పంపిణీ చేస్తున్నామన్నారు. పలు స్వచ్ఛంద సంస్థలు ఇవే కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించనున్నాయి. 

ప్రతీ 15 నిముషాలకు ఒక అత్యాచారం.. 
భారతదేశంలో మహిళలు, బాలికలపై జరిగే లైంగిక దాడులు గురించి తలుచుకుని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్‌ కంటతడి పెట్టుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేశంలోని బాలికలపై ప్రతీ 15 నిమిషాలకు ఒక అత్యాచారం జరుగుతోందని నేర నమోదు సంస్థల లెక్కలు చెబుతున్నాయి. 2017–2018 సంవత్సరంలో దేశంలో 81,147 మంది బాలికలు తమను లైంగిక వేధింపుల నుంచి కాపాడాలని చైల్డ్‌లైన్‌కు ఫోన్‌ చేశారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతోంది. దేశంలో బాలికలపై జరిగే అఘాయిత్యాలపై భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీం కోర్టు స్పందించి ఇటీవల సుమోటోగా కేసు స్వీకరించింది.

2019 జనవరి నుంచి జూన్‌ (ఆరు నెలలు) వరకు దేశంలో 24 వేల మంది బాలికలపై లైంగిక దాడులు జరగడాన్ని సుప్రీంకోర్టు తీవ్రంగా పరిగణించింది. వాటిలో ఇప్పటి వరకు 12 వేలు(50శాతం) కేసులు మాత్రమే విచారణ పూర్తికాగా మిగిలిన 50 శాతం కేసులు పురోగతిలో లేకపోవటంపై సుప్రీం కోర్టు సీరియస్‌గా తీసుకుంది. ఇలా బాలికలపై జరిగే అత్యాచారాలపై సుప్రీం కోర్టు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందిస్తున్నాయి గానీ సమాజం మేల్కోకపోతే వాటిని అరికట్టడంలో జాప్యం జరుగుతుందని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు.  

- వరంగల్లు నగరంలో గత నెలలో అభం శుభం తెలియని 9 నెలల పసికందుపై అత్యాచార సంఘటన యావత్‌ సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేసింది. అదే నెలలో కర్నూలు జిల్లా డోన్‌ పట్టణంలో ఏడు, ఎనిమిదేళ్ల ఇద్దరు చిన్నారులపై 70 ఏళ్ల రైల్వే రిటైర్డ్‌ ఉద్యోగి అత్యాచారయత్నం చేశాడు. పశ్చిమగోదావరి జిల్లా పోలవరం మండలం గాజులగొంది గ్రామంలో ఐదేళ్ల చిన్నారిపై 24 ఏళ్ల కామాంధుడు ఈ ఏడాది ఏప్రిల్‌లో అత్యాచారానికి పాల్పడ్డాడు. గుంటూరు జిల్లాలో పట్టాభిపురం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఎనిమిదేళ్ల బాలికపై ఐదుగురు బాలురు అత్యాచారాయత్నానికి ఒడిగట్టారు. పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోని కూకట్‌పల్లి ఎల్లమ్మబండలో ఐదేళ్ల చిన్నారిపై 40 ఏళ్ల మానవ మృగం అత్యాచారయత్నానికి పాల్పడింది. మన రాష్ట్రంలోనే కాదు. ఇలా దేశం నలుమూలలా బాలికలపై అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. ఆడుకునే వయస్సులో అచ్చట ముచ్చట తీరకుండానే బాలికలు హతమైపోతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top