బాలికపై కామాంధుడి పైశాచికం!

Girl Raped In Visakhapatnam - Sakshi

మాయమాటలతో గర్భవతిని చేసిన వైనం 

అనంతరం అబార్షన్‌ చేయించి దాచేసిన ప్రబుద్ధుడు 

ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన 

ఎన్‌ఏడీ జంక్షన్‌(విశాఖ పశ్చిమ): బాలికపై కామాంధుడి పైశాచిక చర్య ఆలస్యంగా వెలుగుచూసింది. గోపాలపట్నంలో సంచలనం రేపిన ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపాలపట్నం రైల్వే స్టేషన్‌ ప్రాంతం నేతాజీనగర్‌కు చెందిన బాలికపై స్థానికంగా నివాసముంటున్న కామాంధుడి కళ్లు పడ్డాయి. బాలికను లొంగదీసుకుని అత్యాచారం చేయడంతో ఆమె గర్భం దాల్చింది. అనంతరం విషయం తెలుసుకున్న కామాంధుడు గర్భస్రావం కోసం మాత్రలు వాడినా ప్రయోజనం లేకపోగా అధికంగా రక్తస్రావం జరిగింది. దీంతో గోపాలపట్నంలోని 30 పడకల ఆస్పత్రికి తీసుకెళ్లగా అక్కడి వైద్యులు కేజీహెచ్‌కు తరలించాలని రిఫర్‌ చేశారు. అక్కడి నుంచి 108 వాహనంలో బాలికను కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ తన పలుకుబడితో బాలికకు అబార్షన్‌ చేయించేశాడని, అనంతరం బాలికనూ, ఆమె తల్లినీ దాచేశాడని నేతాజీనగర్‌ వాసులు ఆరోపిస్తున్నారు. బాలిక కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేసి ఫిర్యాదు చేయకుండా చేశాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.

ఈ విషయంలో కామాంధుడికి కొందరు రాజకీయ నాయకుల అండదండలు కూడా ఉన్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మరోవైపు బాలిక అప్పటికే 4 నెలల గర్భిణి అని, ఆమెను  తీసుకొచ్చిన వ్యక్తి తమతో గొడవ పడ్డాడని గోపాలపట్నం వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా 108 వాహనంలో తరలించే సమయంలో ఆ సిబ్బంది వివరాలు సేకరించి పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మరోవైపు కేజీహెచ్‌లో కూడా బాలిక గర్భం దాల్చిందనే అనుమానం వచ్చిన వెంటనే పోలీసులకు సమాచారమివ్వాలి. కానీ అలా ఎక్కడా జరగలేదు. అయితే ఈ ఘటనపై తమకు ఫిర్యాదు అందలేదని గోపాలపట్నం సీఐ రమణయ్య చెబుతున్నారు. దీనిపై ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top