‘గిరి’ నుంచి రాష్ట్ర స్థాయికి!
=క్రికెట్ టీమ్లో ప్రశాంత్కు చాన్స్
=దాతల సాయానికి ఎదురుచూపు
చింతపల్లి, న్యూస్లైన్ : రాష్ట్ర స్థాయి క్రికెట్లో పాల్గొనే అరుదైన అవకాశం ఓ పేద గిరిజన యువకుడిని వరించింది. అక్కడ పరుగుల వరద పారిస్తే హైదరాబాద్ ఐపీఎల్ సన్రైజర్స్ జట్టులో చోటు దక్కుతుంది. విశాఖ ఏజెన్సీ గూడెంకొత్తవీధి మండలం జర్రెల గ్రామానికి చెందిన గొర్లె వెంకటగిరి ప్రశాంత్ (19) స్థానిక పరిశోధనా స్థానంలో ద్వితీయ సంవత్సరం అగ్రికల్చర్ డిప్లొమా చదువుతున్నాడు. కుడిచేతివాటం బ్యాట్స్మన్ అయిన ప్రశాంత్ మండల, జోనల్ స్థాయి పోటీల్లో బాగా రాణించడంతో విశాఖపట్నంకు చెందిన సన్ ఎస్ఆండ్ఎస్ జట్టులో చోటు లభించింది. 2009-10 సీజన్లో హైదరాబాద్లో జరిగిన జిల్లా స్థాయిలో పోటీల్లో రాణించాడు.
2013లో ఉత్తరాఖండ్లో జరిగిన ఇండియన్ క్రికెట్ అకాడమీ ట్రోఫీలో సత్తా చాటాడు. గత నెల 16న రాజస్థాన్లో జరిగిన ఇండియన్ క్రికెట్ అకాడమీ పోటీల్లో ముంబ యి జట్టుపై పరుగుల వరద పారించాడు. ఏకంగా 124 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ సొంతం చేసుకున్నాడు. దీంతో ఐపీఎల్ హైదరాబాద్ సన్రైజర్స్ జట్టులో స్థానం కోసం పోటీపడే జట్లలో చోటు దక్కింది. ఈ పోటీల్లో మొత్తం 8 జట్లు పాల్గొంటాయి. ఈ నెల 24 నుంచి పోటీలు ప్రారంభమవుతాయి. ఇందులో ప్రతిభ కనబర్చిన ఐదుగురిని ఎంపిక చేసి ఐపీఎల్ సన్రైజర్స్ జట్టులో స్థానం కల్పించనున్నారు.
పేదరికం శాపం..
ఈ పోటీల్లో పాల్గొనాలంటే ముందుగా తాను సభ్యుడుగా ఉన్న విశాఖపట్నం సన్ ఎస్ఆండ్ఎస్ జట్టుకు రూ.లక్ష డొనే షన్ చెల్లించాలని ప్రశాంత్ తెలిపాడు. పేద కుటుంబానికి చెందిన తాను అంత సొమ్ము చె ల్లించే స్థొమత లేదని చెప్పాడు. ఈ నెల 6,7 తేదీల్లో విరాళం చెల్లించాలని, లేనిపక్షంలో జట్టులో స్థానం కోల్పోతానని ఆవేదన వ్యక్తం చేశారు. దాతలతో పా టు పాడేరు ఐటీడీఏ తనకు ఆర్థిక సాయం అందించాలని కోరాడు. స్పందించే దాతలు 94937 39024 నంబర్కు సంప్రదించాలని ప్రశాంత్ అభ్యర్థించాడు.
జాతీయ జట్టులో ఆడాలన్నదే నా కల
ప్రస్తుతం ఐపీఎల్ సన్రైజర్స్ జట్టులో స్థానం సంపాదించడమే ధ్యేయంగా సాధన చేస్తున్నాను. జాతీయ జట్టులో ఆడాలన్నది నా కల. గిరిజన కుటుంబంలో పుట్టిన నేను ఈ స్థాయికి చేరుకోవడం గర్వంగా ఉంది.
-గొర్లె వెంకటగిరి ప్రశాంత్