పోలింగ్ కేంద్రాలపై డేగకన్ను!


సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:  నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం సరికొత్త నిర్ణయం తీసుకుంది. పోలింగ్ కేంద్రాలను వీడియోలో చిత్రీకరించాలని జిల్లా యంత్రాంగానికి నిర్దేశించింది. సార్వత్రిక ఎన్నికలకు ప్రతిపాదిత పోలింగ్ బూత్‌లను విధిగా వీడియోలో నిక్షిప్తం చేయాలని ఆదేశించింది. పోలింగ్ స్టేషన్ అంతర్భాగం, ఆవరణతోపాటు పరిసరాలు కూడా కనిపించేలా వీడియో ఫుటేజీ ఉండాలని సూచించింది. రెండు నిమిషాల నిడివి గల ఈ సీడీల్లో పోలింగ్ బూత్‌కు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని పొందుపరచాలని స్పష్టం చేసింది.



 ఈ నెల 13వ తేదీలోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలంటూ ఎన్నికల అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారులు పోలింగ్ స్టేషన్ల వీడియో చిత్రీకరణలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సిబ్బంది, ఓటింగ్‌కు అనువుగాలేని భవనాలను పోలింగ్ కేంద్రాలుగా చేయడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ ఈ నిర్ణయం తీసుకుంది. తాగునీరు, కనీస సౌకర్యాలు, వెబ్‌క్యాస్టింగ్‌కు అనువుగా విద్యుత్ కనెక్షన్, ఓటేసేందుకు వచ్చే వృద్ధులు సులువుగా కేంద్రానికి చేరుకునే అవకాశం.. తదితర అంశాలతో కూడిన సమాచారాన్ని నిక్షిప్తం చేయాలని ఈసీ ఆదేశించింది.



తద్వారా వీడియోను పరిశీలించి పోలింగ్ బూత్ స్థితిగతులపై సులువుగా అంచనాకు రాగలుగుతామని కేంద్ర ఎన్నికల సంఘం అంచనా వేస్తోంది. ఈ క్రమంలో చిత్రీకరిస్తున్న వీడియో సీడీలను రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి, కేంద్ర ఎన్నికల కమిషనర్‌కు నివేదించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈసారి ప్రతి స్టేషన్‌లో జరిగే ఓటింగ్‌ను వెబ్‌క్యాస్టింగ్ చేయాలని నిర్ణయించిన ఈసీ.. పోలింగ్ కేంద్రంలో దానికి అనుగుణంగా సదుపాయాలు ఉన్నాయా? లేదా అనే అంశాలను నిశితంగా పరిశీలిస్తోంది.

 

 ఎన్నికల నిర్వహణకు 30వేల మంది

 ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు 30 వేల మంది పోలింగ్ సిబ్బంది అవసరమని జిల్లా యంత్రాంగం అంచనా వేసింది. లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు ఏకకాలంలో జరుగుతుండడంతో అదనపు సిబ్బందిని రంగంలోకి దించాల్సి ఉంటుందని భావిస్తోంది. 2009లో కేవలం 18వేల మందిని మాత్రమే ఎన్నికల విధులకు వినియోగించుకోగా.. ఈసారి మాత్రం ఇది భారీగా పెరగనుంది.



ఇప్పటికే 18వేల మందిని ఎన్నికల విధుల్లో నియోగించుకునేందుకు గుర్తించగా.. మరో పదివేల మందిని అన్వేషించే పనిలో యంత్రాంగం నిమగ్నమైంది. ఈ స్థాయిలో సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థల ఉద్యోగుల డేటాను సేకరించడంలో తలమునకలైంది. పోలింగ్ కేంద్రాల సంఖ్య గణనీయంగా పెరగడం కూడా అదనపు సిబ్బంది అవసరం అనివార్యంగా మారింది. జిల్లా వ్యాప్తంగా 4,469 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేస్తున్నారు.



సుమారు పది వేల ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్(ఈవీఎం)లు అవసరమవుతాయని అంచనా వేసిన యంత్రాంగం.. ఇందులో పదిశాతం ఈవీఎంలను రిజర్వులో ఉంచనుంది. ఇదిలావుండగా.. రాజేంద్రనగర్‌లో ఈవీఎంలు భద్రపరిచేందుకు నిర్మిస్తున్న గోడౌన్ పనులు వారంలోగా పూర్తవుతాయని జాయింట్ కలెక్టర్ ఎంవీరెడ్డి తెలిపారు. ఈవీఎంలపై రాజకీయపార్టీల ప్రతినిధులు, ఎన్నికల అధికారులకు ఇక్కడే అవగాహన తరగతులు నిర్వహించనున్నట్లు చెప్పారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top