తుది అంకంలోకి వచ్చేశాం మరింత పోరాడండి
వైఎస్సార్సీపీ బూత్ స్థాయి శ్రేణులకు వైఎస్ జగన్ పిలుపు
ఓట్లు సరి చూసుకోండి.. ప్రతి ఓటరునూ సమీకరించాలి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల తుది అంకంలోకి వచ్చేశాం కనుక గత నాలుగేళ్లుగా కష్టపడి పార్టీ కోసం పనిచేసిన బూత్ స్థాయి శ్రేణులు మరింత గట్టిగా పోరాటం చేయాలని ట్విట్టర్ వేదికగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి గురువారం పిలుపునిచ్చారు. ప్రతి ఓటూ ఉందో లేదో సరి చూసుకోవాలని, ఎన్నికల పోలింగ్ రోజున అందరినీ సమీకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ‘‘పోలింగ్ బూత్ స్థాయి వైఎస్సార్ కాంగ్రెస్ శ్రేణులందరికీ విజ్ఞప్తి.
గత నాలుగేళ్లుగా మనం కష్టపడి పని చేశాం. ఎన్నికల తుది అంకానికి చేరుకున్న ప్రస్తుత తరుణంలో మరింత శ్రమించి పోరాడాలి. ఇంకొక్క రోజు మాత్రమే మిగిలి ఉంది. ఓటర్ల జాబితాలో ప్రతి ఓటూ ఉందో లేదో సరి చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు.. ఓట్లు వేసే రోజున ప్రతి ఓటునూ సమీకరించి ఓటు వేయించాలి. మిగిలి ఉన్న ఈ 26 రోజులూ మీ గట్టి మద్దతు మరింత ఉండాలని కోరుతున్నాను’’ అని జగన్ ట్వీట్ చేశారు.