పంటలు ఎండిపోతున్నాయి సార్‌..

Farmers meets in ys jagan - Sakshi

నంద్యాలటౌన్‌/కొండారెడ్డి ఫోర్టు/ఆత్మకూరు:   పత్తికొండ నియోజకవర్గంలో ఈ ఏడాది తీవ్ర వర్షాభావం నెలకొని పంటలు ఎండిపోతున్నాయంటూ ఎర్రగుడికి చెందిన నాగేంద్రరెడ్డి, రామచంద్రారెడ్డి తమ ప్రాంత సమస్యలపై వైఎస్‌ జగన్‌కి వినతిపత్రం అందజేశారు. పంటలు పండక, గ్రామాల్లో పనులు లేక అందరూ వలసలు వెళుతున్నారని తెలిపారు. పంటలు పండక చాలామంది రైతులు అప్పుల ఊబిలో కూరుకపోయి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్‌ఆర్‌సీపీ అధికారంలోకి వస్తే ఉపాధి పనులు కల్పించడంతో పాటు రైతుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

వర్షాలు పడకపోవడంతో పంటలు దిగుబడి రావడం లేదని, ఐదెకరాల్లో సాగు చేసిన సద్ద పంటకు కంకులు రాక పూర్తిగా నష్టపోవాల్సి వస్తోందని జొన్నగిరి గ్రామ మహిళలు నారాయణమ్మ, రామలక్ష్మి వైఎస్‌ జగన్‌ దృష్టికి తెచ్చారు. హంద్రీ నీవా నుంచి సాగునీరు అందించాలి ‘హంద్రీనీవా నీటిని మా తండాకు సరఫరా చేయాలని ప్రజాసంకల్ప యాత్ర చెరువు తండాకు చేరుకున్నప్పుడు తండా వాసులు కుళ్లాయి స్వామి నాయక్, శంకర్‌ నాయక్, నారాయణ నాయక్, లక్ష్మణ్‌ నాయక్, బకరా నాయక్, వెంకటస్వామి నాయక్, చంద్ర నాయక్, శివనాయక్‌లు వైఎస్‌ జగన్‌ను కలిసి విన్నవించారు. హంద్రీనీవా నుంచి చెరువుకు నీరు విడుదల చేస్తే 600 ఎకరాల్లో పంట పొలాలు సాగు అవుతాయని, పంటలు పండక వలసలు పోతున్నామని వాపోయారు. తమ తండాలో 16 మంది పింఛన్లను టీడీపీ నాయకులు తొలగించారన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top