కౌలురైతుల కష్టాలు తీర్చండన్నా..!
వైఎస్ జగన్కు కౌలురైతులు వినతి
తూర్పుగోదావరి ,గోకవరం: కౌలురైతుల కష్టాలు తీర్చండన్నా అంటూ సామర్లకోట మండలం గొంచాలకు చెందిన కౌలు రైతులు వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కోరారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా పాదయాత్రగా వచ్చిన జగన్ను వారు కలుసుకుని సమస్యలు వివరించారు. తమ గ్రామంలో వేమవరం కాలువకు సమీపంలో సుమారు 600 ఎకరాల ఆయకట్టు ఉందన్నారు. ఈ పంట పొలాలను ఎక్కువగా కౌలురైతులే సాగు చేస్తున్నారన్నారు. కాలువకు వరద వస్తే సుమారు 200 ఎకరాలు నీట మునిగిపోతుందన్నారు.
కాలువ పూర్తిగా పూడుకుపోయిందని, దీంతో వరద వస్తే పొంగిపోయి ఏటా దాళ్వాలో పంటను నష్టపోతున్నామని వాపోయారు. పంటలు నష్టపోతున్నా టీడీపీ ప్రభుత్వంలో నాలుగేళ్లుగా కౌలురైతులకు ఎటువంటి నష్టపరిహారం అందలేదన్నారు. ప్రభుత్వం కౌలురైతులకు గుర్తింపు కార్డులు ఇస్తున్నా రుణాలు మాత్రం సక్రమంగా ఇవ్వడంలేదన్నారు. కౌలురైతుకు రుణాలు ఇవ్వాలంటే రైతు పాస్పుస్తకాలు తెచ్చుకోవాలని అధికారులు చెబుతున్నారని, రైతులు పాస్పుస్తకాలు ఇవ్వకపోవడంతో రుణాలు పొందలేకపోతున్నామన్నారు. టీడీపీకి చెందిన వారికి మాత్రం రుణాలు అందుతున్నాయన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చిన తరువాత కౌలురైతులకు రైతుల పాస్పుస్తకాలతో సంబంధం లేకుండా రుణాలు ఇచ్చే ఏర్పాటు చేయాలని, ధాన్యం అమ్మిన సొమ్ములు నేరుగా రైతులకు అందేలా చూడాలని కోరారు.
సంబంధిత వార్తలు