నిలువెత్తు అభిమానం
బద్వేలు: ఆయన పేరు జంపన రామక్రిష్ణ కుమార్రాజా. స్వస్థలం విశాఖపట్నం జిల్లాలోని కృష్ణ దేవిపేట. నెత్తిన దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి బొమ్మ కనిపించేలా చుట్ట చుట్టుకుంటారు. ఎక్కడ వైఎస్సార్సీపీ పాదయాత్రలు జరుగుతుంటే అక్కడ ప్రత్యక్షమవుతారు. ప్రచార రథం ముందు నడుస్తూ యాత్రకు వచ్చిన అభిమానులను పక్కకు జరగాలని సూచిస్తుంటారు. సోమవారం దువ్వూరు సమీపంలో జరుగుతున్న ప్రతిపక్షనేత వైఎస్ జగన్ ప్రజాసంకల్పయాత్రలోనూ ఇలానే చేస్తూ పలువురిని ఆకట్టుకున్నారు.
యాత్ర ప్రారంభమైన ఆరో తేదీ నుంచి ఆయన జగన్ వెంట నడుస్తున్నారు. ఆయన్ను సాక్షి పలుకరించగా తాను ఇప్పటికే జగన్ ఓదార్పుయాత్ర, షర్మిళ పాదయాత్రలో పాల్గొన్నాని చెప్పారు. దివంగత సీఎం వైఎస్ అంటే తనకు అభిమానమని, ఆ అభిమానంతోనే జగనన్న వెంట నడుస్తున్నాని చెప్పారు. జగనన్న సీఎం అయ్యేవరకు పార్టీ కార్యక్రమాలు మాననని ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా పాల్గొంటానని చెప్పారు. ఆయన చేయి మీద ఒక పచ్చ బొట్టు ఉంటుంది. అందులో ‘అమ్మ, నాన్న వైఎస్సార్... జగన్’ అని ఉంటుంది. ఆయన అభిమానికి నిలువెత్తు నిదర్శనం.
సంబంధిత వార్తలు