వైఎస్ జగన్కు విశ్రాంతి అవసరం : వైద్యులు
గాయం పూర్తిగా నయం కాలేదు
సాక్షి, హైదరాబాద్ : హత్యాయత్నం ఘటనలో గాయపడ్డ ఏపీ ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గాయం పూర్తిగా నయం కాలేదని సిటీన్యూరో వైద్యులు పేర్కొన్నారు. వైఎస్ జగన్ను శుక్రవారం ఆయన నివాసంలో పరీక్షించిన వైద్యులు అనంతరం మీడియాతో మాట్లాడారు. మరో రెండు వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని వైఎస్ జగన్కు సూచించామన్నారు.
రెండు రోజులకు ఒకసారి ఆయన ఆరోగ్య పరిస్థితిని పరిశీలిస్తున్నామని, గాయం అయిన ప్రాంతంలో కండ ఇంకా పూర్తిగా కూడుకోలేదన్నారు. పాదయాత్రలో చేతులు పైకెత్తి అభివాదం చేయడం వలన నొప్పి మరింత పెరిగే అవకాశం ఉందని, కనీసం ఒక వారం అయినా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని సూచించామన్నారు. హార్ట్ బీట్, బీపీ పరీక్షించామని.. నిలకడగానే ఉన్నాయన్నారు. గాయంతో ప్రజాసంకల్పయాత్రకు స్వల్ప విరామం ప్రకటించగా.. శనివారం నుంచి పునఃప్రారంభం కావాల్సింది. అయితే వైద్యుల సూచనల మేరకు మరికొన్ని రోజులు వైఎస్ జగన్ పాదయాత్ర వాయిదా పడే అవకాశం ఉంది.